"తమ్ముడు" కోసం నేరుగా రంగంలోకి "గాడ్ ఫాదర్": ఎంట్రీ ముహూర్తం ఇదే...!!
ఏపీలో మరో సారి మెగా కాంబినేషన్ పొలిటికల్ తెరపైకి రానుంది. తమ్ముడు కోసం అన్నయ్య నేరుగా రంగంలోకి దిగటానికి రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే రాజకీయంగా పవన్ కల్యాణ్ కు తన మద్దతు ఉంటుందని చిరంజీవి ఎటువంటి సందేహాలకు తావు లేకుండా ప్రకటించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు సరిపోతారని..అత్యున్నత స్థానం దక్కించుకుంటారంటూ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేసారు. పవన్ నా తమ్ముడు..నా సహకారం ఎందుకు ఉండదని ప్రశ్నించిన మెగాస్టార్..ఇక, సోదరుడు పవన్ కోసం రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.

పవన్ కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి
రాజకీయలకు నేను దూరమైనా..రాజకీయాలు నాకు దూరం కాలేదు. గాడ్ ఫాదర్ లో చిరంజీవి డైలాగ్ ఇది. డైలాగే కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారింది. కానీ, ఇప్పుడు తమ్ముడు కోసం రాజకీయ నాయకుడిగా కాదు..స్టార్ క్యాంపెయినర్ అవతారంలో మెగాస్టార్ కొత్త ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్.. పవన్ కు చిరంజీవి మద్దతు ఉంది..జనసేనాని కోసం మెగాస్టార్ వస్తారని చెప్పుకొచ్చారు.
కానీ, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ చర్చ ముందుకు వెళ్లలేదు. కానీ, ఇప్పుడు సీన్ మారుతోంది. చిరంజీవి సోదరులు ఇద్దరూ జనసేనలో ఉన్నారు. రాజకీయం గా పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన పవన్ ఈ సారి మరింత కసిగా కనిపిస్తున్నారు. పొత్తుల వ్యవహారం ఎలా ఉన్నా..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారారు.

పవన్ అత్యున్నత స్థానంలో నిలుస్తారంటూ
ఇప్పటికే గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన నేతలు.. మెగాస్టార్ అభిమాన సంఘాలు వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలవాని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ప్రకటన చేసారు. అటు బీజేపీ జనసేనతోనే మా బంధం అని చెబుతోంది. ప్రధాని మోదీ కార్యాలయం నుంచి పవన్ కు ఆహ్వానం..ఆ తరువాత ప్రధాని - పవన్ కల్యాణ్ భేటీతో ఏపీలో ఒక్క సారిగా రాజకీయం మారిపోయింది. పవన్ కల్యాణ్ టీడీపీతో ఉంటారా .. బీజేపీతో ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.
ఇదే సమయంలో మెగాస్టార్ కు ఫిలిం పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ప్రధాని అవార్డు వచ్చినందుకు..చిరంజీవి వ్యక్తిత్వం పైన ప్రశంసలు కురిపించారు. బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లొ మెగా బ్రదర్స్ మద్దతుతో ముందుకెళ్లే వ్యూహాలు అమలు చేస్తున్నారు. కానీ, చిరంజీవి నుంచి ఇప్పటి వరకు అందుకు సుముఖత రాలేదు.

పవన్ కోసం తొలి సారిగా ప్రజల్లోకి ఇలా..
ఇక, ఇప్పుడు తన ఇద్దరు సోదరులు గతంలో తాను స్థాపించిన ప్రజారాజ్యం కోసం పని చేసారు. ఇప్పుడు ఆ ఇద్దరూ రాజకీయంగా పోరాటం చేస్తున్న సమయంలో తాను సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నారనేది జనసేన నేతలు చెబుతున్నారు. చిరంజీవి కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు అదే రకమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇతర పార్టీల్లోని రాజకీయ ప్రముఖులు సైతం ఈ మధ్య కాలంలో చిరంజీవితో సమావేవాలు నిర్వహిస్తున్నారు.
దీంతో..త్వరలో పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. తిరుపతి వేదికగా చిరంజీవి ఆ బస్సు యాత్రం ప్రారంభ సభలో పాల్గొని ఇక నేరుగా పవన్ కు అండగా నిలవండంటూ పిలుపునిస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే బస్సు యాత్ర ముహూర్తం ప్రకటించనున్నారు. ఇక, ఎన్నికల సమయంలో ప్రచారంలోనూ చిరంజీవి పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications