ప్రధాని సభకు మెగాస్టార్ కు ఆహ్వానం - భీమవరం వేదికగా : కొత్త సమీకరణాలు..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో పొత్తులపై రాజకీయంగా అనేక రకాలుగా చర్చ జరుగుతున్న వేళ.. భారీ ట్విస్టులు చెటు చేసుకుంుటన్నాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించేందుకు టీడీపీ - జనసేన కలిసి పని చేసే వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ రూటు ఏంటనేది తేలాల్సి ఉంది. టీడీపీ మాత్రం బీజేపీ - జనసేనతో కలవాలని కోరుకుంటోంది. కానీ, బీజేపీ మాత్రం టీడీపీతో తిరిగి కలిసేందుకు ఇప్పటి వరకు అయితే సిద్దంగా లేదు. ఏపీలో ఈ సారి ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ చేస్తామని చెబుతోంది. ఈ సమయంలో..సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు, ఇదే సమయంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

మెగాస్టార్ కు ఆహ్వానంతో
జూలై 4న ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. భీమవరంలో అల్లూరు సీతారామ రాజు 125 వ జయంతోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అమృత్ మహాత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి రానున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్ర పర్యాటక శాఖ నుంచి కేంద్ర మాజీ మంత్రి.. మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామ రాజు విగ్రహావిష్కరణ జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. బీజేపీతో - ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు. మాజీ కేంద్ర మంత్రిగా ఆయన పర్యాటక శాఖ పర్యవేక్షించారు. ఏపీలో కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు పలువురు ఉన్నారు.

రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా
అయితే, ఇప్పుడు ప్రధాని సభకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించటం ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగియగానే...చిరంజీవి కాంగ్రెస్ కు పూర్తిగా దూరమయ్యారు. ఆ పార్టీ ముఖ్య నేతలు పలుమార్లు చిరంజీవిని పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని కోరినా..మెగాస్టార్ ఆసక్తి చూపలేదు. పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ పెట్టారు. గత కొద్ది నెలలుగా ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన తిరిగి తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇక, బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజు ఢిల్లీలో తన నియామకం ఖరారు కాగానే.. హైదరాబాద్ చేరుకున్న వెంటనే తన మిత్రపక్షం జనసేన అధినేత ను కాకుండా.. ముందుగా చిరంజీవిని కలిసారు. ఇక, బీజేపీ - జనసేన మిత్రపక్షంగా ఉన్నా రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంతమాత్రంగానే ఉంది.

ఈ ప్రాధాన్యత వెనుక
చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ప్రధాని సభకు ఆహ్వానించటం ద్వారా ఏదైనా వ్యూహం ఉందా.. లేక, రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో ఆహ్వానం పంపారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన 2009 ఎన్నికల్లో ఇప్పుడు ప్రధాని పాల్గొంటున్న భీమవరం పార్లమెంట్ పరిధిలోని పాలకొల్లు నుంచి పోటీ చేసారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మెగాస్టార్ ప్రత్యేకంగా వెళ్లి కలిసిన సందర్బాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రధాని - సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమంలో ఇప్పుడు చిరంజీవికి ఆహ్వానం పంపటం పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా సినీ ఇండస్ట్రీలోనూ చర్చకు కారణమవుతోంది. అయితే, బీజేపీ నేతలు మాత్రం ఇందులో రాజకీయ కోణం లేదని.. ప్రముఖలను ఆహ్వానిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications