సీఎం జగన్కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు... ఆ నిర్ణయంపై హర్షం,వేలాది కుటుంబాలకు మేలు...
కరోనా సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చిత్ర పరిశ్రమ,దాని అనుబంధ వ్యవస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక రాయితీలతో థియేటర్ యాజమాన్యాలకు అండగా నిలిచింది.విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
2020 ఏప్రిల్, మే, జూన్ మాసాలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తదుపరి 6 నెలల (జులై 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు) కాలానికి థియేటర్లు,మల్టీప్లెక్సులు చెల్లించాల్సిన విద్యుత్ స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. థియేటర్ యాజమాన్యాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ వెసులుబాటు మల్టీప్లెక్సులకు ఇవ్వలేదు.
కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, అనుబంధ కార్యకలాపాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ది చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
థియేటర్ యాజమాన్యాలకు మేలు చేసేలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చిత్ర పరిశ్రమ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 'మీరు తీసుకున్న చర్యలు చిత్రపరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు మేలు చేస్తాయి...' అని అభిప్రాయపడ్డారు.
My hearty thanks to Hon'ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021