అలా చెప్పి పవన్ కల్యాణ్ ఇప్పుడెక్కడున్నాడు: మేకపాటి ప్రశ్న
న్యూఢిల్లీ/ గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి నుంచి ప్రశ్న ఎదరైంది. మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడెక్కడున్నాడని ఆయన ప్రశ్నంచారు.
ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరి వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన బుధవారం ఢిల్లీలో అన్నారు. చంద్రబాబుకు ఎంత సేపూ రాజకీయ తాపత్రయమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆయన అన్నారు.
చంద్రబాబుపై మేకపాటి ధ్వజం
చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాల గురించిన ఆలోచనే లేదని మేకపాటి అన్నారు ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. హోదాపై పలు మార్లు మాట మార్చిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.
చంద్రబాబు పోరాటం చేయలేకపోయారు
పార్లమెంటు వేదికగా ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయలేకపోయారని మేకపాటి చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని, తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు
అసెంబ్లీలో మొక్కుబడి తీర్మానం
ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారంనాడు మొక్కుబడి తీర్మానం చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి విమర్శిచారు. దీంతో హోదాపై చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడిందని అన్నారు.
సరైన పద్ధతి కాదు
కేంద్రంపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుంటే కూడా చంద్రబాబు మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదని కోన రఘుపతి అన్నారు. ఆంధ్రప్రజల సెంటిమెంట్తో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.