మేకపాటి నామినేషన్ దాఖలు - మెజార్టీ పైనే ఫోకస్ : బీజేపీ అభ్యర్ధి ఖరారు..!!
ఆత్మకూరు బై పోల్ కు వైసీపీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు చేసారు. వైసీపీ నుంచి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీకి దిగారు. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు బుధవారం బీ ఫారం అందించారు. ఈ రోజు భారీ ర్యాలీతో వెళ్లి ఆయన నామినేషన్ వేసారు. ముందుగా మేకపాటి గౌతమ్రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన విక్రమ్రెడ్డి.. వారి తల్లిదండ్రుల చేతులు మీదుగా నామినేషన్ పత్రాలు అందుకొని, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటుగా పార్టీ నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. తనకు రాజకీయాలు కొత్త అయినా.. ఎన్నికను సీరియస్ గా తీసుకుంటామని విక్రమ్ రెడ్డి చెప్పారు. ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక, ఇప్పటికే ఆత్మకూరు బరిలో నిలవాలని నిర్ణయించిన బీజేపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ ను బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. టీడీపీ - జనసేన ఈ ఉప ఎన్నికలో పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు.
బద్వేలు తరహాలో తమకు 2019 కంటే ఓట్లు పెరుగుతాయనే ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారు. ఇటు వైసీపీ అధినాయకత్వం మాత్రం ఆత్మకూరులో గెలుపు కంటే మెజార్టీ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో మెజార్టీ భారీగా సాధించి..తమ పట్టు నిరూపించుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా.. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు.