రిజైన్ చేయ: మేకపాటి, సిఎం వద్దన్నారు: అంబటి
నెల్లూరు/ గుంటూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మరోసారి రాజీనామా చేసే అలోచన లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాజీనామా చేసినా తిరస్కరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే అన్ని మార్గాలనూ తాము అన్వేషిస్తున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన రాజీనామాను మిగితా పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో పాటు స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాదులో సభ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఎవరూ అడ్డుకున్నా హైదరాబాద్ సభను విజయవంతం చేసి తీరుతామని ఆయన చెప్పారు.
తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం జులైలో అనుకుందని, అయితే దాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆ ప్యాకేజీలో తెలంగాణవారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది ముఖ్యమైన ప్రతిపాదన అని ఆయన చెప్పారు. దాంతో దానికి కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారని రాంబాబు అన్నారు.
ప్యాకేజీని తిరస్కరించారా, లేదా అనే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన తుఫాను కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థత వల్లనే ప్రారంభమైందని ఆయన సోమవారం గుంటూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్సించారు. సిడబ్ల్యుసి ప్రకటన వెలువడిన ముందు రోజు గానీ ఆ రోజు గానీ ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఉంటే సోనియా గాంధీ వెనక్కి తగ్గేవారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడేదని, సిడబ్ల్యుసి ఆ సాహసం చేసి ఉండేది కాదని ఆయన అన్నారు.