గరిట పట్టాలి, భార్య కన్నా ఆయన వంట రుచి: బాబు, జగన్-సీఎం '40 ఏళ్ల'పై రోజా
విజయవాడ/గుంటూరు: మగవాళ్లు గరిట పట్టే సమయం వచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. అడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారన్నారు. ఇలాంటి సమయంలో పురుషులు ఇళ్లలో గరిట పట్టే సమయం వచ్చిందన్నారు.
వంటలెలా చేయాలో మగవాళ్లు నేర్చుకోవాలని సూచించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను చైనా పర్యటించినప్పుడు జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు.
చైనా పర్యటనలో భాగంగా తాను ఓ నగర మేయర్ను కలుసుకున్నానని, అతని భార్య కన్నా ఆయనే రుచికరమైన వంటలను తయారు చేస్తున్నాడన్నారు. ఆ మేయర్ తన ఇంట భోజనం చేయాలని ఆహ్వానించినట్టు తెలిపారు.
ఈ ప్రగతి ప్రాజెక్టు ప్రారంభించిన చంద్రబాబు
చంద్రబాబు విశాఖలరో శుక్రవారం నాడు ఈ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ-ప్రగతి ద్వారా 33 శాఖలు, 315 సంస్థల నుంచి ఈ-సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ శాఖల సమాచారమంతా ఒకేచోట లభ్యం కావడంతో పౌరసేవలు మరింత త్వరగా లభించే అవకాశముంది.
జగన్ దీక్షలో రోజా
ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. దీక్ష ప్రాంగణంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. జగన్ను చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు.
ఈ ఉద్యమాన్ని చంద్రబాబు కూడా ఆపలేరని, వానపాములు (మంత్రులు) బుసకొడుతున్నాయని వ్యాఖ్యానించారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కాబట్టే టిడిపి నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు 40 ఏళ్ల వయసున్న జగన్ను చూసి వణుకుతున్నారన్నారు.