మా కొడుకు లోకేష్ నా భార్య మాటే వింటాడు: ఎందుకో చెప్పిన చంద్రబాబు
తన భార్య పారిశ్రామికవేత్త అని, సహజంగానే తన కుమారుడు ఆమె మాటే ఎక్కువ వింటాడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు.
విజయవాడ: తన భార్య పారిశ్రామికవేత్త అని, సహజంగానే తన కుమారుడు ఆమె మాటే ఎక్కువ వింటాడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు. మహిళలు ఆర్థికంగా శక్తిమంతులైతే అంతా వారి మాటే వింటారని వ్యాఖ్యానించారు.
ఏం చేయాలో నాకు తెలుసు: పవన్కు బాబు కౌంటర్! కేవీపీ, వైసీపీలకు కూడా
వరకట్నం వంటి దురాచారాలు మహిళా సాధికారతతోనే దూరమవుతాయన్నారు. మగవాళ్లే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు ముందు ముందు వస్తాయని చెప్పారు. తిరుపతిలోని ఎస్వీయూలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో భాగంగా బుధవారం ఆరవ మహిళా సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించారు.
చంద్రబాబు హాజరై ప్రసంగించారు. పురుషులకంటే మహిళలు ఏ విధంగానూ తక్కువ కాదన్నారు. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే వ్యవసాయం వంటి రంగాల్లో పని చేయాల్సి వచ్చేది కాబట్టి మహిళల్ని ఇళ్లకే పరిమితం చేసేవారన్నారు.
ప్రస్తుతం మహిళలు దూసుకుపోతున్నారు. ఐటీ వంటి రంగాల్లో శారీరక శ్రమ అవసరం లేదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారన్నారు. కుటుంబ ఆర్థిక నిర్వహణలో వారికి వారేసాటి, నిరక్షరాస్య మహిళల్లో కూడా అద్భుతమైన లౌకికజ్ఞానం, తెలివితేటలు ఉంటాయన్నారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థలో వారికి సాటి లేరన్నారు.
వచ్చే నెలలో అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తున్నామని, దానికి అంతా హాజరు కావాలన్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనశాలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని, మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.