విలీన రాజకీయం: కెసిఆర్తో కాంగ్రెసు మైండ్ గేమ్
హైదరాబాద్: విలీన రాజకీయాలను కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రక్తి కట్టిస్తున్నాయి. విలీనంపై ఎటూ తేల్చని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు మైండ్ గేమ్ ఆడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విలీనానికి కెసిఆర్పై ఒత్తిడి తెచ్చేలా రాజకీయానికి వారు పదును పెడుతున్నారు. విలీనం చర్చలు ముగిశాయని, విధివిధానాలను మాత్రమే ఖరారు చేయాల్సి ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఇది వరకు రెండు సార్లు చెప్పారు.
దిగ్విజయ్ సింగ్ మాటలతో తెరాస నాయకులు విభేదించారు. ఆదివారంనాడు స్వయంగా కెసిఆర్ దిగ్విజయ్ సింగ్తో విభేదిస్తూ ప్రకటన చేశారు. అయితే, గురువారంనాడు దిగ్విజయ్ కాస్తా మాట మార్చినట్లు కనిపిస్తున్నారు. కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి విలీనం చేయాలని, కెసిఆర్పై తమకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే బేషరతుగా తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తానని గతంలో చెప్పిన కెసిఆర్ మాటను పట్టుకుని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు.
కాగా, హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ కాస్తా దూకుడుగా వ్యవహరించారు. కెసిఆర్ అధికారంలోకి వస్తే దొరల రాజ్యం వస్తుందని, సామాజిక తెలంగాణ జాతీయ పార్టీలతోనే సాధ్యమని ఆయన తెలంగాణ జెఎసి నేతలతో అన్నట్లు వార్తలు వచ్చాయి. తమ పార్టీలోకి రావాలని జెఎసి నేతలు ఆహ్వానం కూడా పలికారు. మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని సమర్థించాలని ఆయన తెలంగాణ జెఎసి నేతలకు సూచించి, వారిని నైతికంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు, తెరాస నాయకులను తమ పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి కాంగ్రెసు అధిష్టానం ఊతం ఇస్తోంది. శాసనసభ్యుడు అరవింద్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడింది. విజయశాంతిని కూడా కాంగ్రెసు అధిష్టానం పార్టీలో చేర్చుకుంది. ఆ రకంగా కెసిఆర్పై కాంగ్రెసు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెసులో పార్టీని విలీనం చేసే విషయంపై ఆలోచిస్తామని చెబుతూనే కెసిఆర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రత్నం, మహేందర్ రెడ్డిలను తెరాసలో చేర్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు నగేష్ కూడా త్వరలో తెరాసలో చేరే అవకాశం ఉంది.
ఇదిలలావుంటే, కెసిఆర్ భవిష్యత్తు కార్యాచరణపై తన ఫామ్ హౌస్లో కెసిఆర్ ముఖ్య నాయకులతో గురువారం చర్చలు జరిపారు. పార్టీని విలీనం చేయవద్దని కొంత మంది నాయకులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో తెరాసను కాంగ్రెసు విలీనం చేసే విషయాన్ని దాటవేసే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, కెసిఆర్ను బలహీనరపరిచే వ్యూహాన్ని మాటల ద్వారా, చేతల ద్వారా కాంగ్రెసు అధిష్టానం అనుసరించడం ప్రారంభించిదని అంటున్నారు.