ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోహిణీకార్తెలో రోళ్లు పగిలే ఎండ ఉంటుందని సామెత. అందుకు తగ్గట్లుగానే ఎండలుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న అల్ప పీడనం బలహీనపడటంతో నైరుతి రుతుపవనాలు కూడా బలహీనపడ్డాయి. దీనివల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి.
రాబోయే రెండు రోజుల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతోపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో చెదురు మదురుగా తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. జూన్ నెల ప్రారంభంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఎండలు మరికొన్ని రోజులు దంచికొట్టాయి.

రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వ్యవసాయ పనుల్ని ప్రారంభించిన రైతులకు మళ్లీ వర్షాభావ పరిస్థితులు కనపడుతుండటంతో నిరాశకు లోనవుతున్నారు. రానున్న రెండురోజుల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications