హైదరాబాద్ ఆఫీస్లో సత్య నాదెళ్ల, అంతా రహస్యమే
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈవో) సోమవారంనాడు హైదరాబాదులోని తమ కంపెనీ భారత అభివృద్ధి కేంద్రం (ఐడిసి) ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐడిసి ప్రసంగంలో ఆయన తన దృక్పథాన్ని వెల్లడించారు. అమెరికాలోని రెడ్మోండ్ తర్వాత ప్రపంచంలోని అతి పెద్ద మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఇదే.
గచ్చిబౌలిలో గల ఐడిసి ఆవరణను సిఈవో సందర్శించినట్లు సంస్థ అధికారి ఒకరు ఓ వార్తాసంస్థ ప్రతినిధితో అన్నారు. ఐడిసిలో కంపెనీ ఉన్నతాధికారులతో సత్య నాదెళ్ల రహస్య సమావేశం నిర్వహించారు. ఐడిసి హైదరాబాదులోని గచ్చిబౌలిలో 1998లో ఏర్పాటైంది.

ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సిఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెళ్ల తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనను మైక్రోసాఫ్ట్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రహస్యంగా ఉంచారు. నాదెళ్ల ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు.
నాదెళ్ల, కెసిఆర్ మధ్య భేటీకి సంబంధించిన విషయాలు కూడా ఏమీ వెల్లడి కాలేదు. నగరంలో నాదెళ్ల పర్యటన వివరాల గురించి అధికారిక సమాచారమేదీ లేదు. మంగళవారంనాడు తిరిగి అమెరికాకు వెళ్లే ముందు ఢిల్లీలో కొన్ని కార్యక్రమాల్లో నాదెళ్ల పాల్గొంటారని తెలుస్తోంది.
చంద్రబాబుకు ఫోన్...
సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పుట్టిన సత్య నాదెళ్లతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్తో పెట్టుబడులు పెట్టించాలనేది చంద్రబాబు ఆలోచన.












Click it and Unblock the Notifications