lockdown:100 కి.మీ నడక, అస్వస్థతకు గురవడంతో.. అంత్యక్రియలకు నో, పరీక్ష చేశాక ఓకే..
లాక్డౌన్ వల్ల వలసకూలీల పరిస్థితి దయనీయంగా మారింది. వలసవచ్చిన చోట పనిలేక.. తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నవారు ఎందరో.. చిత్తూరు జిల్లాకు చెందిన వలసకూలీ కూడా పనిలేకపోవడంతో.. వంద కిలోమీటర్లు నడిచి.. అలసి, సోలసి మృత్యుతీరాలకు చేరి... కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు.
ఉపాధి కోసం వెళ్లి..
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మిట్టపల్లెకు చెందిన హరిప్రసాద్ (26) పొట్ట చేతపట్టుకొని బెంగళూరు వెళ్లాడు. అక్కడే కూలీ పని చేసుకొని ఉంటున్నాడు. అయితే లాక్ డౌన్ కొనసాగడం.. పని లేకపోవడంతో స్వగ్రామానికి వెళ్లాలని అనుకొన్నాడు. బస్సు, రైళ్లు నడవకపోవడంతో కాలినడకన వెళ్లాలని అనుకొన్నాడు. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్లు నడిచి.. సోమవారం తన ఇంటికి చేరుకున్నాడు.
మంగళవారం మృతి..
కానీ ఆ మరునాడే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మంగళవారం దవాఖానలో హరిప్రసాద్ చనిపోయాడు. అయితే మృతదేహం ఇంటికి తీసుకొచ్చాక.. అసలు సమస్య మొదలైంది. అతనికి కరోనా వైరస్ ఉందెమోనని, అంత్యక్రియలకు గ్రామస్థులు అడ్డుచెప్పారు. దీంతో వైద్యులు వచ్చి హరిప్రసాద్ రక్తనమూనాలను సేకరించారు. అయితే అతనికి వైరస్ లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు అంగీకరించారు. గ్రామ శివారులో హరిప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించారు.
హోంశాఖ ఆదేశాలు..
వలసకూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. స్వస్థలం చేరుకున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఓకే అనుకుంటే ఇంటికి.. లేదంటే క్వారంటైన్ సెంటర్కు తీసుకెళ్లే అవకాశం కల్పించింది. అయితే రెండురోజుల ముందు వచ్చేందుకు అనుమతించిన గ్రామస్తులు.. చనిపోయాక మాత్రం వైరస్ ఉంది అని అనుమానించారు. మృతదేహానికి నెగిటివ్ రావడంతో అంత్యక్రియలు జరిగాయి.. లేదంటే అని హరిప్రసాద్ బంధువులు తలచుకొని బాధపడుతున్నారు.
31 మంది మృతి
ఏపీలో 1403 మందికి వైరస్ సోకగా... 31 మంది చనిపోయారు. మంగళవారం ఒక్కరోజే 71 మందికి వైరస్ సోకింది. 321 మందికి వైరస్ తగ్గడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 1051 మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విజయనగరంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాకపోవడంతో కాస్త ఊరటనిచ్చే అంశం.