ఒంగోలులో స్వల్ప భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం
అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్న సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రజలు భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూ ప్రకంపనల వల్ల జరిగిన నష్టం తాలుకా వివరాలపై ఇంకా సమాచారం అందలేదు. అయితే, రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఎంత నమోదైందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఒంగోలులో పలుమార్లు భూకంపం సంభవించింది.
ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం
ప్రకాశం జిల్లాలో సోమవారం పెద్ద పులి హల్ చల్ చేసింది. గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో పులి కాలిముద్రలను చూసిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని కాలిముద్రలు పరిశీలించారు. పెద్దపులి సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
విశాఖలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
విశాఖలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని మల్కాపురం ప్రాంతంలో ఇండియన్ నేవీకి చెందిన మిగ్ 29కే యుద్ధవిమానానికి స్వల్ప ప్రమాదానికి గురైంది. మిగ్ 29కే టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విమానం టేకాఫ్ అయిన క్రమంలో విమానం అదనపు ఇంధన ట్యాంక్ ఊడి కింద పడిపోయింది. ఊడిపోయిన ఇంధన ట్యాంక్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది నివాసాల సముదాయం ఆవరణలో పడిపోయింది. వెంటనే అప్తమత్తమైన సిబ్బంది విమానాన్ని ఐఎన్ఎస్ డేగ వద్ద క్షేమంగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని నేవీ ప్రకటించింది. సాంకేతిక సమస్యల వల్లనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, నౌకాదళ సిబ్బంది దర్యాప్తు ఆరంభించారు.