మినీ మహానాడుకు వెళ్లినందుకు పాలసేకరణ నిలిపివేత.. మంత్రి పెద్దిరెడ్డి డెయిరీ నుంచి ఒత్తిడి?
తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు హాజరయ్యారన్న కారణంతో చిత్తూరు జిల్లాలోని శ్రీజ డెయిరీపై శివశక్తి డెయిరీ మేనేజర్ ఒత్తిడి చేసి తమ గ్రామంలో పాలసేకరణ నిలిపివేయించారంటూ రైతులు ఆందోళన చేశారు. అన్నమయ్య జిల్లా సోమల మండలం వెంగంవారిపల్లెకు చెందిన పాడి రైతులు కందూరు-వల్లిగట్ల రోడ్డుపై పాలు పారబోసి నిరసన తెలియజేశారు. శివశక్తి డెయిరీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందినది. శ్రీజ డెయిరీ పాల సేకరణ ఏజెంట్ మధు చెప్పిన వివరాలప్రకారం..
సోమల మండలం వల్లిగట్ల పంచాయితీ వెంగంవారిపల్లెకు చెందిన రైతులు ఫిబ్రవరి నుంచి ఉదయం, సాయంత్రం రెండుపూటలా శ్రీజ డెయిరీకి 200 లీటర్ల పాలు పోస్తున్నారు. కలికిరి మండలం ఎల్లంపల్లి నుంచి ఓ ఆటో వచ్చి వాటిని తీసుకువెళుతుంది. జులై 6న మదనపల్లెలో జరిగిన మినీమహానాడుకు వెంగంవారిపల్లె వాసులు అధిక సంఖ్యలో వెళ్లారు. అదే నెల 16వ తేదీన పాలసేకరణ నిలిపేస్తామంటూ డెయిరీ మేనేజర్ చెప్పగా కొనసాగించాలని రైతులు కోరారు. రెండు రోజుల క్రిందట శ్రీజ డెయిరీ ప్రతినిధులు నారాయణరెడ్డి, మనోజ్ కుమార్ ఫోన్ చేశారు. ఆగస్టు 1 నుంచి ఆటోను నిలిపేస్తున్నామని చెప్పారు. ఆటో రాకపోవడంతో డెయిరీ మేనేజర్ కు ఫోన్ చేశారు.
పైనుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి.. శివశక్తి డెయిరీ మేనేజర్ ఫోన్ చేసి ఆటోను నిలిపేయాలని చెప్పారు.. వారు ప్రభుత్వంలో ఉన్నారు.. మేమేం చేయలేం.. మీరు వేరేదారి చూసుకోండని చెప్పారు. 200 లీటర్ల పాలను ఏం చేసుకోవాలని అడగ్గా ఏమీ చెప్పలేదు. ఫిబ్రవరిలో మా ఊరి నుంచి ఒక క్యాను పాలు పోయగా, ఇప్పుడు 40 కుటుంబాలు కలిపి నాలుగు క్యాన్లు పోస్తున్నాం. మాకు న్యాయం చేయకుంటే ఆవులు అమ్మేసి ఊరు వదిలి వెళ్లిపోవాల్సిందేనని మధు వెల్లడించారు.