బిజెపితో టిడిపి: అసద్ ఆగ్రహం, బాబుకు డొక్కా సవాల్
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో విపక్ష నేతలు ఆ పార్టీలపై మండిపడుతున్నారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ టిడిపిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమది లౌకికవాద పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు బిజెపితో ఎలా వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు.
తెలుగుదేశం మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతోందన్నారు. ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టిడిపి కనుమరుగు కావడం ఖాయమన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలు కూడా బిజెపి, టిడిపిల పైన నిప్పులు చెరిగారు.
బలవంతపు పెళ్లి: డొక్కా
టిడిపి, బిజెపి పార్టీల పొత్తు బలవంతపు పెళ్లి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. టిడిపికి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేశారు.
ఎన్ని సీట్లు వస్తాయి: రఘువీరా
బిజెపి, టిడిపిల పొత్తుతో తమకు ఎలాంటి నష్టం లేదని మాజీ మంత్రి, ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. తెలంగాణలో బిసిలను సిఎం చేస్తానని చెప్పిన చంద్రబాబు... ఆ తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత టిడిపి, జగన్ పార్టీలు భూస్థాపితం అవుతాయన్నారు.
రామచంద్రయ్య ఆఘ్రహం
టిడిపి, బిజెపిల పొత్తుపై కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య మండిపడ్డారు. ఈ రెండు పార్టీల పొత్తు ఓ అపవిత్ర కలయిక అన్నారు. మతతత్వవాది అయిన మోడీ ఫొటోను పెట్టుకుని చంద్రబాబు ఓట్లు ఎలా అడుగుతారన్నారు. ఏమి ఆశించి ఈ రెండు పార్టీలు కలిశాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
బాబు నాయకత్వంలోనే: జెసి
చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్ర అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు. ఆ ఉద్దేశంతోనే తానూ తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి విభజన వల్ల కలిగే నష్టాలను అనేకసార్లు వివరించానని, అయితే వారు స్వార్ధపూరితంగా వ్యవహరించడం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. టిడిపిలోకి వచ్చే ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామన్నారు.
ఎన్నికలపై డిఎల్
ఇంతటి అధ్వానపు ఎన్నికలను తానిప్పటి వరకూ చూడలేదని మాజీ మంత్రి, టిడిపి నేత డిఎల్ రవీంద్రా రెడ్డి కడప జిల్లాలో అన్నారు. అభ్యర్థులకు పాస్ల జారీలో తీవ్ర జాప్యం చేశారని, కడప జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.