మంత్రి ఆది నారాయణరెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి వైసిపిలో చేరనున్నారా?
కడప:మంత్రి ఆదినారాయణ రెడ్డికి త్వరలో గట్టి షాక్ తగలనుందా?...మంత్రి సోదరుడు నారాయణ రెడ్డి తన కొడుకుతో సహా వైసిపిలో చేరబోతున్నారా? ...అంటే అవుననే అంటున్నారు జమ్మల మడుగు వైసిపి నేతలు...
రాజకీయ భవిష్యత్తు విషయంలో మంత్రి ఆది నారాయణ రెడ్డికి ఆయన సోదరుడు నారాయణ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ నేపథ్యంలో తమ పొలిటికల్ ఫ్యూచర్ దృష్ట్యా మంత్రి సోదరుడు నారాయణ రెడ్డి వైసిపిలోకి రావాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు వైసిపి సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని, ఆ ముహూర్తానికే తన కుమారుడు భూపేష్ తో సహా వైసిపిలో చేరతారని బల్లగుద్ది చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే...జమ్మలమడుగు ఎమ్మెల్యేగా వైసిపి తరుపున గెలిచి ఆ తరువాత పార్టీ ఫిరాయించి టిడిపిలోకి వచ్చి ఏకంగా మంత్రి అయిన చదిపిరాల ఆదినారాయణ రెడ్డికి అతి త్వరలోనే తన కుటుంబ సభ్యుల నుంచే రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగలనుందని చెబుతున్నారు. అందుకు కారణం మంత్రి సోదరుడు నారాయణ రెడ్డి ఇచ్చే షాకే నని చెబుతున్నారు. గతంలో వైసిపి తరుపున పోటీ చేసే అవకాశం తమకు వచ్చినా సోదరుడు ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఇస్తే చివరకు ఆయన తమకే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడని మంత్రి అన్న నారాయణ రెడ్డి ఆవేదన చెందుతున్నారట.
ఇటీవలి కాలం వరకు తన రాజకీయ వారసుడు అన్న నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ అని చెప్పిన మంత్రి ఆది మరోవైపు సైలెంట్ గా జమ్మలమడుగు నియోజకవర్గంలో అన్ని సెటిల్మెంట్లు తన భార్య, కుమారుడు సుధీర్ రెడ్డికి అప్పగించారట. ఈ విషయం తెలిసి నారాయణరెడ్డి షాక్ అయ్యారట. సొంత సోదరుడే తనకు వెన్నుపోటు పొడిచాడని ఆప్తుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే సరిపోదని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారట. మంత్రి సోదరుడు నారాయణరెడ్డి గతంలో ఒకసారి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోగా, ఆ తరువాత వైసిపి తరుపున ఎమ్మెల్యేగా గెలవడం గమనార్హం. అయితే సోదరుడు ఆదితో పాటే ఈయన కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
ఆ క్రమంలో తనకు వెన్నుపోటు పొడిచిన తమ్ముడికి గుణపాఠం చెప్పేందుకు వైసిపి లోకి వెళ్లి ఆయన మీదే పోటీ చెయ్యాలని నారాయణ రెడ్డి భావిస్తున్నారట. అలాగే వైసిపి తరుపున జమ్మలమడుగు టికెట్ తనకిచ్చినా సరే లేకుంటే తన కుమారుడు భూపేష్ కు ఇచ్చినా సరే గెల్చుకొని తీసుకువస్తామని నారాయణ రెడ్డి ధీమాతో ఉన్నారట. ఆ క్రమంలోనే జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో సాగుతుండగానే వీలైనంత త్వరలో వైసిపి లో చేరాలని ముహూర్తం కూడా రెడీ చేసేసుకున్నారని టాక్ నడుస్తోంది. సో మరి కొద్ది రోజుల్లోనే ఈ వార్తపై సస్పెన్స్ వీడడం...మంత్రి ఆదికి షాక్ తగలటం ఒకేసారి జరుగుతాయంటున్నారు కడప వైసి నేతలు.