మూడు రాజధానులు -కొత్త ముహూర్తం : తాజా వ్యూహం..!!
ఏపీలో మరోసారి మూడు రాజధానుల పై కదలిక మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెర పైకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి రైతులు వ్యతిరేకించారు. న్యాయస్థానం ఆశ్రయించారు. సుదీర్ఘంగా న్యాయ పోరాటం సాగింది. ఈ వ్యవహారం కోర్టులో ఉన్న సమయంలోనే ప్రభుత్వం ఆనూహ్యంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అదే సమయంలో తిరిగి సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును సభలో ప్రవేశ పెడతామని సీఎం జగన్ చెప్పారు.
ప్రభుత్వం కొత్త ఆలోచనలు
ఈ అంశం పైన తీర్పు ఇచ్చిన హై కోర్టు ఆరు నెలల్లోగా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించింది. దీని పైన అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం 60 నెలల సమయం కోరింది. నేటితో హైకోర్టు తీర్పుకు ఆరు నెలల సమయం ముగిసింది. తాజాగా.. హైకోర్టులో రైతుల పిటీషన్ పైన చర్చ సమయంలో.. ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన రివ్యూ లేదా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలా అనే అంశం పైన ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా మంత్రి అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సాధారణ ఎన్నికలలోపే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టొచ్చని చెప్పారు.
లీగల్ అభిప్రాయాల ఆధారంగా
ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశంలో దీని పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత ..ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తారని చెబుతున్నారు.
అయితే, హైకోర్టు తీర్పు పైన తొలుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టులో తీర్పును రివ్యూ చేస్తూ కోరటం.. సుప్రీంలో ఎస్ఎల్పీ దాఖలు చేయటమో ముందుగా చేయాల్సి ఉంది. ప్రభుత్వ అభ్యర్దన పైన కోర్టు తీసుకొనే నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం దిశగా
దీంతో.. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పైన నిర్ణయం సందేహంగానే కనిపిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాల పైన ప్రభుత్వంలోని ముఖ్యులు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ప్రతిపక్షాలు అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో..రాజకీయంగా వైసీపీ పై చేయి సాధించే వ్యూహాలు సిద్దం చేస్తోంది.
అందులో భాగంగా.. ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశం.. ఆ తరువాత జరిగే అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని చెబుతుండటంతో.. ఎటువంటి నిర్ణయం ఉంటుదా అనే ఆసక్తి నెలకొని ఉంది.