పాదయాత్ర కాదు.. ఒళ్లు బలిసినవారి యాత్ర: అంబటి రాంబాబు
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసినవారు చేస్తున్న పాదయాత్ర'' అని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కోడూరులో నిర్వహించిన వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో గెలిచే పరిస్థితి లేదని, తన పార్టీపై ఆయనకు నమ్మకం లేక ఇతర పార్టీలతో కలిసి పొత్తుకు వెళదామని యోచిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని కాపాడేందుకే జనసేన పార్టీని స్థాపించారని, అటువంటివారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్... ఇలా ఎంతమంది కలిసి పోటీచేసినా జగన్మోహన్ రెడ్డే మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని జోస్యం చెప్పారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు రెండో విడత పాదయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి వరక 60 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈనెల 12వ తేదీన ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. ప్రభుత్వం మూడు రాజధానులడం, యాత్ర ప్రారంభమయ్యే సమయానికి అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో గ్రామసభలకు నోటీసులు వచ్చాయి.
వీటిని అన్ని గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరేసరికి ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయేమోననే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన మంత్రి బొత్స రెండుసార్లు మీడియాతో మాట్లాడారు. కన్నెర్ర చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని, కానీ తాము అలా చేయమన్నారు. ఆయనే మరోసారి తాజాగా పాదయాత్రను ఎలా ఆపుతామో చూస్తారా? అంటూ వ్యాఖ్యానించారు.