కాళేశ్వరానికి పోలవరం ప్రాజెక్టుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా: హరీష్రావుకు మంత్రి అంబటి కౌంటర్!!
పోలవరం ప్రాజెక్టు విషయంలో తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. పోలవరం ప్రాజెక్టు ఇంకో ఐదేళ్లలో కూడా పూర్తి కాదు అంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ రగడకు కారణంగా మారాయి . ఇక మంత్రి వ్యాఖ్యలకు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ను మరో అయిదేళ్లు అయినా పూర్తి చేయలేరని, పోలవరం పనులు పురోగతిపై అక్కడ ఇంజనీర్లతో మాట్లాడానని పేర్కొన్న మంత్రి, మరో ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తే గొప్పే అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పోలవరం కాళేశ్వరం కంటే ముందే స్టార్ట్ అయినప్పటికీ పూర్తి కాలేదని గుర్తు చేసిన ఆయన, మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేసుకున్నామో అందరూ చూశారు అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్న ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి రాంబాబు
ఇక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు అక్కడ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పారో లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కించపరచడానికి పోల్చారో తెలియదుగానీ కాళేశ్వరం ప్రాజెక్టు వేరు, పోలవరం ప్రాజెక్టు వేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజ్ అని, అది పూర్తిగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
పోలవరానికి, కాళేశ్వరానికి పోలికే లేదు
కానీ పోలవరం అలా కాదని పేర్కొన్న ఆయన, ఇది బహుళార్థసాధక ప్రాజెక్టు అంటూ తేల్చి చెప్పారు . 196 టీఎంసీల నీటిని స్టోర్ చేసుకొని, గ్రావిటీ ద్వారా నీటిని తరలించి, నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం అని పేర్కొన్న ఆయన అసలు పోలవరానికి, కాళేశ్వరానికి పోలికే లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను తెలిపిన మంత్రి అంబటి రాంబాబు పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతుంది అనేది వాస్తవమేనని అంగీకరించారు.
టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యం
దానికి అనేక కారణాలను వెల్లడించిన ఆయన డయాఫ్రం వాల్ ముందే నిర్మించటం వల్ల ఈ సమస్య వచ్చిందని, తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. స్పిల్ వే తర్వాత డయాఫ్రం వాల్ నిర్మించాలని, కానీ అలా కాకుండా ముందే డయాఫ్రం వాల్ నిర్మించడం వల్ల ఇబ్బంది తలెత్తిందన్నారు. డయాఫ్రం వాల్ వరదలకు దెబ్బతినడంవల్ల, ఇప్పుడు దాని గల కారణాలపై పరిశీలన జరుగుతోందని, దానిపై క్లారిటీ వచ్చిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన కూడా ఒక స్పష్టత వస్తుందని అంబటి రాంబాబు వెల్లడించారు.