వారాహికి, వరాహికి తేడా వివరించిన మంత్రి
భీమవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జ్వరం వల్ల ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఈ సాయంత్రం భీమవరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఎక్కాక వారాహి కాస్తా వరాహిగా మారిందని ఎద్దేవా చేశారు. వారాహి అంటే అమ్మవారు అని, అమ్మవారి పేరు పెట్టిన వారాహిని వాహనంగా చేసుకోవడం తప్పని, దానిపై ఎక్కి ప్రయాణం చేస్తే అనర్ధాలకు దారితీస్తుందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.

వరాహం అంటే పంది.. వారాహి అంటే శక్తివంతమైన దేవత అని అర్థం. ఎప్పుడైతే పవన్ వారాహి అనే దేవత పేరు చెప్పుకుని ఆ వాహనం ఎక్కాడో అప్పుడు అది పంది అయిపోయిందంటూ అంబటి అన్నారు. ఏ సమావేశానికి వెళ్లినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని, దీన్ని తప్పు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.
జగన్ వెంటనే దిగిపోవాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని, అదే జరిగితే ఏమౌతుందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? అని చెప్పుకొచ్చారు అంబటి. అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా.. వంటి అనేక పథకాలు కనుమరుగవుతాయని అన్నారు. అందుకే జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటోన్నారని పేర్కొన్నారు.
ఎన్నికల వరకూ వీళ్లు హలో ఏపీ అంటారు..ఎన్నికల తర్వాత ఛలో హైదరాబాద్ అంటారని పవన్ కల్యాణ్, చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు అంబటి రాంబాబు చెప్పారు. వారిద్దరిదీ గెస్ట్ హౌస్ జీవితమంటూ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ హలో ఏపీ...అమ్మేశా జేఎస్పీ అనే నినాదాన్ని అందుకోవాలని, జనసేనను చంద్రబాబుకు అమ్మేశాననే నిజాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళంపైనా విమర్శలు చేశారు అంబటి రాంబాబు. యువగళంలో గళం లేదని, పవన్ కళ్యాణ్ది గరళంతో కూడుకున్న గళమని చెప్పారు. ఇద్దరూ ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంటారని, టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు సొంత పార్టీ కార్యకర్తలు సైతం రావట్లేదని అన్నారు. ఆ మాత్రం దానికే కన్నా లక్ష్మీనారాయణ సవాళ్లు విసురుతున్నారని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications