కుర్చీదేముంది- నాలుక మడత పడకుండా చూసుకో బాబూ
Nara Lokesh: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటోన్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికలు సమీపించినందున ఇక షర్ట్ స్లీవ్స్ను మడత పెట్టే సమయం వచ్చిందంటూ జగన్.. వలంటీర్లకు వందనం సభలో చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతోంది.

అధికార పార్టీ నాయకులు షర్ట్ స్లీవ్స్ను మడత పెడితే.. ప్రజలు కుర్చీని మడత పెడతారంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను ఓటర్లందరూ తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
దీనికి కొనసాగింపుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఏకంగా కుర్చీని మడత పెట్టి చూపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రజలు ఈ కుర్చీలాగే మడత పెట్టేస్తారని అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

జగన్కు స్కామ్స్టర్గా అభివర్ణించారు. రాజధాని ఫైల్స్ సినిమానూ అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఏ ప్రాంతానికీ న్యాయం చేయలేదంటూ మండిపడ్డారు. అయిదు సంవత్సరాల పాటు కాలయాపన చేశారని విమర్శించారు.
నెల్లిమర్ల సభలో నారా లోకేష్.. కుర్చీని మడతపెట్టడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్లు వేస్తోన్నారు. కుర్చీని మడతపెట్టడం అంటే నిజంగా కుర్చీ అని భ్రమపడ్డాడని సెటైర్లు సంధిస్తోన్నారు. ఎన్నికలు దగ్గరికొచ్చినప్పటికీ ఇంకా అభ్యర్థుల జాబితాను తేల్చట్లేదని గుర్తు చేస్తోన్నారు.
ఈ లిస్టులో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం చేరిపోయారు. నారా లోకేష్పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్.. కుర్చీ సంగతి తరువాత అంటూ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ను షేర్ చేశారాయన.












Click it and Unblock the Notifications