పవన్ కల్యాణ్కు ఇప్పటం చెప్పిన నీతి కథ ఇదే..!!
అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం ఉదంతం పట్ల జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ల గుట్టు హైకోర్టు తీర్పుతో రట్టు అయిందని అన్నారు. హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని, తప్పుడు పిటీషన్లు వేసిన వారిపై 14 లక్షల రూపాయల జరిమానా విధించడం అంటే మామూలు విషయం కాదని వ్యాఖ్యానించారు. ఆక్రమణలను తొలగించడమే నేరంగా భావించిన వారిద్దరికీ హైకోర్టు తీర్పు చెంప పెట్టులాంటిదని పేర్కొన్నారు.
ఓవర్ యాక్షన్..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇప్పటంలో ఆక్రమణలను చట్టబద్ధంగా తొలగించడాన్ని కూడా చంద్రబాబు- పవన్ కల్యాణ్ తప్పు పట్టారని, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనేంతగా ఓవర్ యాక్షన్ చేశారని విమర్శించారు. వారికి రామోజీ రావు వంత పాడాడని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని పవన్ కల్యాణ్.. చంద్రబాబు-రామోజీ రావు చెబుతున్నట్లు వింటోన్నారని మండిపడ్డారు.
హైకోర్టును కూడా మభ్య పెట్టేలా..
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయాలనేంత స్థాయిలో పవన్ కల్యాణ్ అతిగా ప్రవర్తించాడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. న్యాయస్థానానికి వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారని, ఆ తరువాత విచారణలో బండారం అంతా బయటపడిందని అన్నారు. చట్టబద్ధంగానే ఇప్పటంలో ఆక్రమణలను అధికారులు కూల్చారని స్పష్టంచేశారు. ఆక్రమణదారులు అధర్మంగా ప్రవర్తించినప్పటికీ- వారిని అడ్డుగా పెట్టుకుని హైకోర్టును కూడా మభ్యపెట్టారని ధ్వజమెత్తారు.
అఫిడవిట్లో తప్పుడు సమాచారమా?
అఫిడవిట్లో సైతం తప్పులు రాసి, స్టే తెచ్చుకునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు ఇది కోర్టును మభ్యపెట్టడం కాదా అని నిలదీశారు. అంందుకే హైకోర్టే స్వయంగా జోక్యం చేసుకుందని, తమకు తప్పుడు సమాచారం ఇచ్చిన 14 మంది ఫిటీషనర్లపై లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఎక్కువకాలం నిలువలేవని ఆయన తేల్చి చెప్పారు.
ఇప్పటం నీతి కథ
చంద్రబాబు- పవన్ కల్యాణ్ - రామోజీరావు కుట్ర చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని భ్రమ పడ్డారని, వారు ఇలా అక్రమ దారుల్లో వెళ్తే ఏ జరుగుతుందనేది ఇప్పటం కథలో నీతి స్పష్టంగా చెప్పిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చిట్ఫండ్ కంపెనీల మీద సోదాలు జరుగుతున్నాయని, మార్గదర్శకాలను ఉల్లంఘించిన సంస్థలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోన్నారని అంబటి రాబాంబు పేర్కొన్నారు.
చట్ట వ్యతిరేకంగా..
మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ కూడా చట్టానికి వ్యతిరేకంగా, నియమ నిబంధనలను ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అంబటి రాంబాబు అన్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరైనా..చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ కేసును డిస్మిస్ చేసుకోవాలని రామోజీ రావు ప్రయత్నించారని, ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు సాగలేదని అన్నారు.