పవన్ కళ్యాణ్ కూలీ నెంబర్ వన్; చంద్రబాబు దళిత ద్రోహి: మంత్రి అంబటి రాంబాబు!!
టిడిపి అధినేత చంద్రబాబు పై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, పవన్ కళ్యాణ్ కూలి నెంబర్ వన్ అంటూ అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ తాను ఎదగడని, ఇంకొకరిని ఎదగనివ్వడని మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు.
దళితులను మోసం చేస్తున్న చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను నమ్మితే సర్వనాశనం తప్ప మరొకటి ఉండదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా నోట్లో వేలు వేసుకొని చంద్రబాబు చెయ్యి పట్టుకొని తిరుగుతున్నాడు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు పచ్చ జెండా ఊపితేనే పవన్ కళ్యాణ్ వారాహి వాహనం కదులుతుందని చంద్రబాబు రెడీ అంటే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఆడవాళ్లు బంగారం తో వడ్డాణం చేయించుకుని ఇంట్లో దాచుకున్నట్టు, పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని తయారు చేసుకొని ఇంట్లో దాచుకున్నాడు అని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ అంటూ ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చాడని, చంద్రబాబుకు సపోర్ట్ చేశాడని, అప్పటినుంచి ఇప్పటివరకు ఏమైనా పెరిగావా.. అదీ లేదు.. ఇంకా తగ్గిపోయావ్ అంటూ ఎద్దేవా చేశారు. మరుగుజ్జు వేషాలు పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఈసారి జరిగే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది పేదలు, పేదల పక్షాన పోరాటం చేస్తున్న సీఎం జగన్ అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ మాట ప్రతి ఒక్కరూ రాసి పెట్టుకోవాలని ఆయన సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే సమాధులు పూడ్చుకోవడానికా సెంటు భూమి, సమాధులు కట్టుకోవడానికి సెంటు భూమి అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని చేసినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా గెలిచేది మాత్రం వైసిపి నేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications