ఆ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదు.. బండారం బయటపడుతుందనా.. : చంద్రబాబుకు మంత్రి అనిల్ ప్రశ్న
గతంలో సుజనా చౌదరి,సీఎం రమేష్లపై ఐటీ దాడులు జరిగితే... కేంద్రం తమపై కక్ష కట్టిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన మాజీ పీఎస్పై ఐటీ దాడులు జరిగితే ఎందుకు నోరు మెదపట్లేదని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఐటీ దాడుల విషయం ప్రజలకు తెలిస్తే అసలు బండారం బయటపడుతుందని మాట్లాడట్లేదా అని నిలదీశారు. ఐటీ దాడులను పక్కదారి పట్టించేందుకే పోలవరం పనులు నిలిచిపోయాయని,కియా మోటార్స్ తరలిపోతోందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే మంచి పనులు గుర్తించకపోయినా పర్లేదు గానీ తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని సూచించారు.

అంత గగ్గోలు పెట్టాల్సిన అవసరమేంటి..
ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నారని.. అప్పుడు అధికారుల అంతుచూస్తామని బెదిరిస్తున్నారని అనిల్ అన్నారు. ప్రతిపక్షంలో ఉంటూనే అధికారుల అంతుచూస్తామని బెదిరిస్తున్నారంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఇంకెలా వ్యవహరించి ఉంటారో అన్నారు. ఒక్క అధికారిని సస్పెండ్ చేస్తేనే లబోదిబోమంటున్నారని విమర్శించారు. నిజాయితీ ఉంటే ఆయనే బయటపడుతాడని.. అంతలా గగ్గోలు పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని.. ప్రభుత్వానికి కొమ్ముకాశాడని వాళ్ల ఎంపీలే ఆరోపిస్తున్నారని అన్నారు. ఏబీ నాడు అధికారిగా కాకుండా టీడీపీ సభ్యుడిగా వ్యవహరించారని ఆరోపించారు.

ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా..
చంద్రబాబు తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందన్నారు. మాట్లాడితే ఐటీ అనే చంద్రబాబు.. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క మెగా ఐటీ ప్రాజెక్టును తీసుకురాలేదన్నారు. డాబులు తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యం అన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. ఇకనైనా ఆయన్ను ఆస్పత్రిలో చూపించాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంక్షేమ,అభివృద్ది పథకాలు బాగా అమలవుతున్నాయని.. కుల,మతాలకు అతీతంగా అందరి బాగోగుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

అమరావతితో ఆటోనగర్ను ముడిపెడుతారా..
అమరావతి నిర్మాణం ఆగిపోవడం వల్ల ఆటోనగర్ కుదేలైపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆటోనగర్ స్థాపించి 30-40ఏళ్లు గడిచిందని.. భవిష్యత్తులో అమరావతి వస్తుందని లెక్కలేసుకుని దాన్ని స్థాపించలేదన్నారు. 2014 నుంచి 2017వరకు పోలవరంపై ఎంత ఖర్చు చేశారు.. ఏయే పనులకు ఖర్చు చేశారో చెప్పగలుగుతారా అని ప్రశ్నించారు. 2014-2017 వరకు పనులే సాగలేదని.. అప్పుడు ఆటోనగర్ లేదా అని నిలదీశారు.

దానిపై ఎందుకు మాట్లాడట్లేదు...
పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850కోట్లు ఆదా చేస్తే దాని గురించి ఎక్కడా మాట్లాడట్లేదని అనిల్ అన్నారు. కేవలం తమ బంధువు కాంట్రాక్టును తొలగించారన్న అక్కసుతోనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్పై సీబీఐ కేసుల విషయంలో విపరీతమైన దుష్ప్రచారం చేశారని.. కానీ చంద్రబాబుకు 15 ఏళ్లు పీఎస్గా ఉన్న వ్యక్తిపై ఐటీ దాడులు జరిగితే దానిపై ఎక్కడా ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications