వైరల్ ఫొటోను ట్వీట్ చేసిన మంత్రి బొత్స
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు రెండోరోజూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.
మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

అటు తెలుగుదేశం పార్టీ కూడా వలంటీర్లను లక్ష్యంగా చేసుకుంది. అమరావతిలో ఇటీవలే నిర్వహించిన పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. వలంటీర్లపై ఆరోపణలు గుప్పించారు. డేటా చోరీకి పాల్పడుతోన్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.
ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో!
— Botcha Satyanarayana (@BotchaBSN) July 16, 2023
వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట!
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి… pic.twitter.com/Rbugxg5meF
వారు చేసిన విమర్శలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. కోట్లాదిమంది ప్రజలు, ప్రతి కుటుంబానికీ ఎంతగానో మేలు చేస్తోన్న వలంటీర్లు, వలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఓ ఫొటోను మంత్రి బొత్స ట్వీట్ చేశారు. ప్రజలకు సేవలను అందిస్తోన్న వలంటీర్లపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాళ్లు విసురుతున్న ఫొటో అది. దీన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రజలకి మంచి చేసే వలంటీర్ల వ్యవస్థను టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేస్తారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ సంక్షేమ పథకాల లబ్దిని పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తారని బొత్స మండిపడ్డారు. మళ్లీ జన్మభూమి కమిటీల్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి, పెత్తందారులకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పాత పద్ధతికి శ్రీకారం చుడతారని ఆరోపించారు.
ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయాలని, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలి అని ప్రశ్నించారు బొత్స. ప్రజలకు మేలు చేస్తోన్న వలంటీర్ వ్యవస్థపై నీచమైన మాటలతో విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించుకోండి అంటూ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications