ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోంది - ఇద్దరు ఎమ్మెల్యేలపై: మంత్రి బొత్సా..!!
ఏపీ సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని స్పష్టం చేసారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులకు జనవరిలో శంకుస్థాపన జరుగనుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ పలు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇద్దరు ఎమ్మెల్యేల పని తీరు పైన మంత్రి బొత్సా ఆగ్రహం వ్యక్తం చేసారు.
వైసీపీ అధికారంలోకి రాకుండా కుట్రలు
ఏపీలో వైసీపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మంత్రి బొత్సా కీలక కామెంట్స్ చేసారు. సీఎం జగన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అసత్యాలతో చంద్రబాబు అండ్ టీం ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని బొత్స పేర్కొన్నారు.
రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ పలు చర్యలు తీసుకుంటున్నారని.. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలంటూ సూచించారు.
కార్యకర్తలు ఫోన్లు చేసినా ఇద్దరు ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తటం లేదని..ఇలాగైతే నష్టపోతారని హెచ్చరించారు. పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. అదే సమయంలో విశాఖ పరిపాలనా రాజధానిగా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
పరిపాలనా రాజధాని రూట్ మ్యాప్ సిద్దం
విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిగా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మంత్రి బొత్సా వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దమైందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే విశాఖను రాజధానిగా చేస్తున్నామని.. శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
భోగాపురం విమానాశ్రయం పనులకు జనవరిలో శంకుస్థాపన జరుగనుందని తెలిపారు. విశాఖ రాజధాని అశోక్ గజపతిరాజుకు ఇష్టంలేదంటూ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి ఎయిర్పోర్టు నిర్మించలేదని బొత్స విమర్శించారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఇదే సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
పార్టీ గెలుపు కోసం అహోరాత్రులూ కష్టించి పనిచేసే కొంత మంది నాయకులు, కార్యకర్తలకు పదవులు రాలేదని, వారంతా నిరుత్సాహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కాకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. బిల్లులను సంక్రాంతిలోగా చెల్లించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
పదవులు - బిల్లులపైనే వినతులు
పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో కోరారు. పార్టీ గెలుపు కోసం వారంతా కష్టపడ్డారని గుర్తు చేసారు. అదే విధంగా బిల్లులు పెండింగ్ అంశం పైన పలువురు ప్రస్తావించారు. సంక్రాంతి లోగా బిల్లుల చెల్లింపుకు ప్రయత్నం చేస్తానని సుబ్బారెడ్డి హామీ ఇవ్వగా.. ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు.
భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి జిల్లాల్లోని అందరూ సమన్వయంతో పనిచేయాలని ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. గ్రామ, పట్టణ వార్డులలో సమన్వయ కర్తల నియామకాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.