ఎందుకీ కడుపుమంట, అక్కసు - ఇదీ జరిగింది: మంత్రి బొత్సా..!!
ఏపీ మంత్రి బొత్సా సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా అక్కస్సు వెల్లగక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రారంభోత్సవంపై టీడీపీ నేతలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. విమానాశ్రయాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని స్పష్టం చేసారు. జీర్ణించుకోలేక, రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని బొత్సా ఆరోపించారు. 34 నెలల సమయంలో విమానాశ్రయం పూర్తవుతుందని బొత్సా వెల్లడించారు.
భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ కు మంత్రి బొత్సా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నుంచి విమానాశ్రయం పనులు మొదలవుతాయని వెల్లడించారు. విమానాశ్రయం శంకుస్థాపనతో పండుగ వాతావరణం ఏర్పడిందని వివరించారు. విమానాశ్రయం కోసం 12 వేల ఎకరాలు భూసేకరణ కోసం ప్రతిపాదించారని బొత్సా గుర్తు చేసారు. ఆ ప్రాంతంలో సర్వే జరగలేదా అని ప్రశ్నించారు. తాము ముఖ్యమంత్రిని కలిసి 12 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పామని చెప్పుకొచ్చారు. వెయ్యి లేదా రెండు వేల ఎకరాలు సరిపోతుందని చెప్పిన అంశాన్ని వివరించారు. ఎక్కువగా తీసుకుంటే మిగతా భూములు తిరిగి ఇస్తామని వైయస్ జగన్ చెప్పింది వాస్తవం. ఆ రోజు వైయస్ జగన్ చేసిన పోరాటమే 2,300 ఎకరాలకు కుదించామని బొత్సా వెల్లడించారు.

విమానాశ్రయం ఏపీ విభజన చట్టంలో ఉందని బొత్సా గుర్తు చేసారు. నాడు విమానాశ్రయం భూమి పూజకు కేంద్ర మంత్రి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అప్పుడు టీడీపీ ఎన్డీఏలోనే ఉందన్నారు. రైతులు ఎవరూ తమ భూములు వెనక్కి ఇవ్వమని అడగలేదన్నారు. అందరూ సంతోషంగా భూములు ఇచ్చారని పేర్కొన్నారు. న్యాయస్థానాలు అంగీకరించాయని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో ఈ ప్రభుత్వం అడ్డంకులు తొలగించి నిర్మిస్తుంటే మీ కడుపు మంట ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పై ఎందుకు అంత అక్కసు అని నిలదీసారు. రాష్ట్ర అభివృద్ధికి భోగాపురం మూలస్తంభంగా ఉంటుందని మేం భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రలో ఉన్న మత్స్యకారుల కోసం చింతపల్లి ఫిషింగ్ జట్టిని విస్తరించాలని స్థానికులు కోరుతున్నారని..దీని పైన సీఎంతో మాట్లాడి ఒప్పిస్తామని బొత్సా చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications