బొత్స సత్యనారాయణ డిమాండ్ ఇదే!
విశాఖపట్నాన్ని రాజధానిగా వద్దు అనేవారికి ఉత్తరాంధ్రలో పర్యటించే హక్కు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్త్రత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ మూడు ముక్కలాట అంటూ విమర్శలు చేస్తున్న చంద్రబాబును ప్రజల నమ్మే పరిస్థితి లేదని, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసితీరాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే పరిపాలనా రాజధానిగా విశాఖ రూపాంతరం చెందడం ఒక్కటే మార్గమన్నారు.
విశాఖను రాజధానిగా ప్రకటించేందుకు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు బొత్స అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు ప్రతి ఇంటి తలుపు తడుతున్నాయిన, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి లేదని, తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే ఇంటింటికీ వెళ్లగలుగుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, జోగారావు తదితర నాయకులు పాల్గొన్నారు.
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మూడుముక్కలాటగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆయన రాజాం నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. బాబు పర్యటనను దృష్టిలో ఉంచుకొనే బొత్స వ్యాఖ్యానించారు.