అశోక్ గజపతి రాజు దుర్బుద్ధి బయటపడింది; ఆయనకు విలువలు లేవని భగ్గుమన్న మంత్రి బొత్సా
రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం, అశోక్ గజపతిరాజు తనకు అవమానం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అశోక్ గజపతిరాజు దేవాలయ ధర్మకర్త గా సంస్కారంతో వ్యవహరించడం లేదని, హుందాగా ప్రవర్తించడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. కావాలనే రాద్దాంతం చేసి వెళ్ళారని మండిపడ్డారు.
అశోక్ గజపతిరాజు దుర్బుద్ధిని బయటపెట్టారు
ఇప్పటికే అశోక్ గజపతిరాజు రాజకీయ మనుగడ కోసమే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని, దేవుడు పైన కూడా నీచ రాజకీయాలకు దిగటం హేయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇక తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అశోక్ గజపతిరాజు తీరుపై నిప్పులు చెరిగారు. కోదండ రామాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తుంటే అశోక్ గజపతిరాజు దుర్బుద్ధిని బయటపెట్టారని బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శంకు స్థాపన కోసం ఆహ్వానం ఇవ్వడానికి వెళ్లినప్పుడు, ఆహ్వానించడానికి వెళ్ళిన ఈవోని, ప్రధాన అర్చకులను తిట్టారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
రాజరికపు అహంకారంతో అశోక్ గజపతి ఉన్నారు
ఆయన ప్రవర్తించిన తీరు ఇలాంటి సాంప్రదాయాలు జిల్లాలో ఎప్పుడూ లేవని బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలయ చైర్మన్ గా ఆలయ అభివృద్ధికి సంబంధించి బాధ్యత లేదని, ప్రభుత్వాన్ని ఎన్నడూ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి విజ్ఞాపనలు చేయలేదని, ఒక లెటర్ కూడా రాయలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏ రోజు తన విలువలను కాపాడుకో లేదని బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు రాజరికపు అహంకారంతో ఉన్నారని, తప్పు చేసిన వారిని శ్రీరాముడు చూసుకుంటాడని బొత్స సత్యనారాయణ చెప్పారు.
అశోక్ గజపతి రాజుకు తల్లిదండ్రులు ఇదే నేర్పించారా ?
అశోక్ గజపతి రాజు లాంటి పెద్దమనిషి ఇలా ప్రవర్తించడం సరికాదని, కనీసం సంస్కృతి సాంప్రదాయాలు తెలియని వ్యక్తిలా ప్రవర్తించారని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. అశోక్ గజపతి రాజుకు తల్లిదండ్రులు ఇదే నేర్పించారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బొత్ససత్యనారాయణ. అశోక్ గజపతిరాజు ఆలయ అభివృద్ధి పట్టించుకోకపోవడం తోనే ప్రభుత్వ ఈ కార్యక్రమాలను చేస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు వేశామని అయితే అందుకు ఆగ్రహించిన అశోక్ గజపతిరాజు శిలాఫలకాన్ని తోసివేయడం అవమానకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆయన ఖర్చు చెయ్యలేదని మండిపడ్డారు. గతంలో ఎన్నో గుళ్ళు కూల్చివేశారు అని, ఇలాంటి వాళ్ళు వ్యవస్థకే వినాశనం అంటూ అశోక్ గజపతిరాజు పై నిప్పులు చెరిగారు.
Recommended Video
రామతీర్ధం ఆలయ శంకుస్థాపనలో అశోక్ గజపతిరాజుకు అవమానం,ఆందోళన
ఇదిలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్రంగా అవమానించింది అని, అధికారులు ప్రోటోకాల్ ను పాటించకుండా, తనను వేదనకు గురి చేశారని దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థం బోడి కొండ కోదండ రామాలయ నిర్మాణ పనులు కార్యక్రమంలో తనకు అవమానం జరిగిందని పేర్కొన్న అశోకగజపతి రాజు శంకుస్థాపన శిలాఫలకం లో తన పేరు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని తీసివేసే ప్రయత్నం చేయగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం కావాలని ఈ విధంగా ప్రవర్తిస్తోందని మండిపడిన అశోక్ గజపతి రాజు ప్రభుత్వ తీరుతో, మంత్రుల ప్రవర్తనతో తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్లు గా చెప్పారు.