విశాఖ ఎన్సీసీ భూముల వివాదంపై ధర్నా చేసిన టీడీపీనేతలు అడగాల్సింది చంద్రబాబునే: మంత్రి బొత్సా
విశాఖ భూములపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతుంటే తిరిగి తమ పైనే ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన టీడీపీ నేతలు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సందేహాలు తీర్చడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
టీడీపీ హయాంలోనే విశాఖ భూములు ఎన్సీసీకి కేటాయిస్తూ జీవో
విశాఖ భూముల కు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జీవో నెంబర్ 121 జారీ చేశారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే ఎన్సిసి సంస్థకు జీపీఏ ఇచ్చారని కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చడానికి వీలు లేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక కేబినెట్ సమావేశంలో మార్పులు చేర్పులు చేయాలని భావించిన నేపథ్యంలోనే తమ ప్రభుత్వం జీపీఏ ఉపసంహరించుకుంది అని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ధర్నా చేసిన టీడీపీ నేతలు అడగాల్సింది చంద్రబాబునే
విశాఖ ఎన్సీసీ భూముల వివాదం పై దర్యాప్తు చేస్తామని పేర్కొన్న ఆయన టూ మెన్ కమిటీ భూమిలో 197 కోట్లుగా నిర్ణయించిందని వెల్లడించారు.టూ మెన్ కమిటీ నిర్ణయించిన ప్రకారం డబ్బులు కట్టాలని ఎన్సిసి సంస్థకు చెప్పామని పేర్కొన్న ఆయన ప్రభుత్వానికి రూపాయి కూడా నష్టం రానివ్వబోమని వెల్లడించారు. గత మూడు రోజులుగా విశాఖలో ఒక భూమిని ప్రభుత్వం ధారాదత్తం చేసిందని ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఆరోపిస్తున్నారని పేర్కొన్న ఆయన ఈ వ్యవహారంలో ధర్నా చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబును ప్రశ్నించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేసిన దానిలో తప్పేంలేదు.. తప్పంతా చంద్రబాబుదే
ప్రభుత్వం చేసిన దాంట్లో ఎక్కడ తప్పు ఉందో చెప్పాలి అని ప్రశ్నించారు బొత్ససత్యనారాయణ. అసలు ఎన్సీసీ సంస్థకు ఇచ్చిన భూమి 2005లో పిపిపి విధానంలో భూమిని అభివృద్ధి చేయడానికి ఇచ్చారని పేర్కొన్నారు. మొత్తం 97 ఎకరాల 10 సెంట్ల భూమి కి ఎన్సిసి సంస్థ ప్రభుత్వానికి 90 కోట్ల రూపాయలు చెల్లించిందని వెల్లడించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో ఎన్సిసి సంస్థతో ఒప్పందాన్ని 2013లో ప్రభుత్వం రద్దు చేసుకోవాలని భావించిందని, అయితే 2014 సంవత్సరంలో ఎన్ సి సి హైకోర్టుకు వెళ్లిందని హైకోర్టు ఈ కేసులో స్టేటస్ కో ఇచ్చిందని తెలిపారు.
టీడీపీ నేతలు అసలు ఏం జరిగిందో తెలుసుకుని ధర్నాలు చెయ్యాలి
2019 ఎన్నికలకు ముందు ఎన్సిసి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కు వచ్చాయని పేర్కొన్నారు. ఇక ఎన్సిసి 2020లో మరో 97 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. చేసిందంతా చంద్రబాబు చేసి ఇప్పుడు తామేదో తప్పు చేసినట్లుగా టిడిపి నేతలు ధర్నాలు చేయడం ఆశ్చర్యంగా ఉందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
మధురవాడ ఐటీ హిల్స్ భూముల అడ్డగోలు కేటాయింపు పాపం చంద్రబాబుదే అని పేర్కొన్న ఆయన దానికి వ్యతిరేకంగా చంద్రబాబు అప్పుడు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నాలు చేసే ముందు పూర్వాపరాలు తెలుసుకోవాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.