విశాఖతోనే ఆగదు.. తీరు మారకపోతే రాయలసీమలోనూ అడ్డుకుంటారు : బాబుకు బొత్స హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకే విశాఖ వచ్చారని.. వచ్చిన పని చూసుకుని పోకుండా విశాఖ ప్రజలను కించపరిచేలా మాట్లాడారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో అంతా సజావుగా సాగిపోతుంటే.. విభేదాలు సృష్టించడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ వెళ్లినా ఇదే జరుగుతుందని.. ప్రజలంతా ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఎలాగూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని.. ఇప్పుడు విశాఖను సీఎం జగన్ ముంబై,హైదరాబాద్ నగరాలకు ధీటుగా తయారుచేయాలని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాధించేమీ లేదు..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాధించేమీ లేదని.. ఏ వర్గానికి ఏమీ చేయలేదని బొత్స విమర్శించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు దోపిడీ,అవినీతికే పరిమితమయ్యారని ఆరోపించారు. నాయకుడంటే అందరికీ,అన్ని ప్రాంతాలకు నాయకత్వం వహించాలని.. కొందరి కోసమే పనిచేయడం సరికాదని అన్నారు. సీఎం జగన్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లుతుండటంతో ప్రభుత్వానికి ఆటంకం కలిగించే కుట్రలు చేస్తున్నారన్నారు. అసలు ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు.
Recommended Video


రాయలసీమలోనూ అడ్డుకుంటారు..
వెనుకబడిన జిల్లాలకు తాగునీరు,సాగునీరు ఇవ్వవద్దా అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర సహా వెనుకబడిన జిల్లాలు అభివృద్ది చెందవద్దనే యాటిట్యూడ్తో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు.
ఉత్తరాంధ్ర ప్రజలపై విషం చిమ్మేందుకే విశాఖ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే రాయలసీమలోనూ అడ్డుకుంటారని హెచ్చరించారు. టీడీపీ హయాంలో రూ.1లక్షా 95వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని విమర్శించారు. అన్ని అప్పులు చేసినా రాష్ట్రంలో ఎక్కడా ఆస్తులు సృష్టించలేకపోయారని ఆరోపించారు. ఈరోజు ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టని దుస్థితి కల్పించారని ఆరోపించారు.

అరిగిపోయిన క్యాసెట్..
పులివెందుల రాజకీయం అంటూ మళ్లీ అరిగిపోయిన క్యాసెట్ వినిపిస్తున్నారని చంద్రబాబుపై బొత్స మండిపడ్డారు. కాపు ఉద్యమ సమయంలోనూ తూర్పుగోదావరిలో జరిగిన ఘటనలపై పులివెందుల,రాయలసీమ మనుషులే విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారన్నారు. ఇప్పుడు కూడా అదే క్యాసెట్ వినిపిస్తున్నారని విమర్శించారు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టు చంద్రబాబు బుద్ది మారదని.. మనిషి మారడని విమర్శించారు. చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణ జరుగుతోందని.. త్వరలోనే ఎవరు దొంగలో తేలిపోతుందన్నారు.

విశాఖ పర్యటన వివాదాస్పదం
గురువారం విశాఖపట్నం వెళ్లిన చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాల రీత్యా పోలీసులు ఆయన్ను ముందస్తుగా అదుపులోకి తీసుకుని తిరిగి విమానాశ్రయానికి తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితిలు ఏర్పడ్డాయి. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగా.. ఆయనకు మద్దతుగా టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి వచ్చాయి. దీంతో పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో.. పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications