అది- బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వేసిన ప్లాన్..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లా బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. దీని తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు.. దీనికి తోడయ్యాయి. చంద్రబాబు విమర్శలకు ధీటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందిస్తోన్నారు. ఆయన ఆరోపణలను తిప్పి కొడుతున్నారు.

ప్రజల నుంచి నో రెస్పాన్స్..
తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ.. స్పందించారు. విశాఖపట్నానికి సచివాలయాన్ని తరలించడంతోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర వ్యతిరేకి అనేది స్పష్టమైందని, అందుకే ఆయన పర్యటనకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించట్లేదని న్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతుంటారని, చంద్రబాబు విషయం అది పూర్తిగా తేడా కొట్టిందని ఆమె ఎద్దేవా చేశారు. ఏపీలోనే చంద్రబాబుకు నిలువ నీడ లేదని, ఇక తెలంగాణలో ఆయనను ఎవరు ఆదరిస్తారని ప్రశ్నించారు.

బీజేపీతో పొత్తు కోసం..
భారతీయ జనతా పార్టీ నేతల కళ్లల్లో పడటానికి, పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు ఇదంతా చేస్తోన్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఏపీలోనే దిక్కు లేదని స్పష్టం చేశారు. తన పర్యటనలకు ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటోన్నారంటూ చంద్రబాబు చేసిన విమర్శల్లో పస లేదని విడదల రజినీ పేర్కొన్నారు. ఆయన పర్యటనలకు స్వచ్ఛందంగా ప్రజలు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారామె. ప్రజలు రాలేదనే నెపాన్ని చంద్రబాబు పోలీసుల మీదికి నెట్టే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు.

చంద్రబాబు వైపు ఎందుకు చూస్తారు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని, అలాంటప్పుడు చంద్రబాబు వైపు ఎందుకు చూస్తారని విడదల రజిని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలన్నీ ఇంటి వద్దకే అందుతున్నాయని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సాధించిన ఘన విజయాన్ని ఆమె గుర్తు చేశారు.

ఓటమితో సైకోలా..
చంద్రబాబు చేసిన విమర్శలపై రాజాం వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఎదురుదాడికి దిగారు. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు సైకోలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. 2014-2019 మధ్యకాలంలో ప్రభుత్వాన్ని పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో ఇటీవలే స్పష్టం చేసిందని అన్నారు. నీరు- చెట్టు పథకం కింద ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.

మూడు రాజధానులకు మోకాలడ్డు..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి మోకాలడ్డుతున్న చంద్రబాబు- ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కంబాల జోగులు అన్నారు. ఇలాంటి సైకో ఉపన్యాసాలను చేస్తూ పోతే ప్రజలు మరోసారి చీదరించడం ఖాయమని ఆయన చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్ పరిపాలన సాగిస్తోన్నారని, ఆయనను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications