మాస్టర్ప్లాన్లో ఇవి, సింగపూర్ మంత్రికోసం బాబు వెయిటింగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతికి రాజధాని మాస్టర్ ప్లాన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సోమవారం నాడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాస్టర్ ప్లాన్ను చంద్రబాబుకు అందించారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ పైన ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ బృందం బాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు చంద్రబాబుతో ఈశ్వరన్ బృందం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. అనంతరం ఇరువురు విలేకరులతో మాట్లాడరనున్నారు.
కాగా, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కోసం చంద్రబాబు తన ఛాంబర్ వద్ద పది నిమిషాలు వేచి చూశారు. ఆయన రాగానే స్వాగతం పలికారు. అక్కడి నుండి తన చాంబర్కు స్వయంగా తీసుకు వెళ్లారు. 219 చదరపు కిలో మీటర్ల కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ను ఈశ్వరన్ బృందం ముఖ్యమంత్రికి అందజేశారు.
ఈ 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరం, నిర్మాణాలు ఎలా ఉండాలన్న ప్రణాళికను సింగపూర్ తయారు చేసింది. భూములు ఇచ్చిన రైతులకు సమీప గ్రామాల్లోనే భూములను పరిహారంగా ఇవ్వనున్నారు. మాస్టర్ ప్లాన్ అందజేసిన అనంతరం ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.
మార్పులు సూచించిన ఏపీ
సింగపూర్ రాజధాని మాస్టర్ ప్లాన్కు ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. తాజా మాస్టర్ ప్లాన్ గ్రీన్ బెల్ట్ ప్రాంతంగా ఉండనుంది. రాజధానిలో గోల్ఫ్ స్టేడియం, మోటార్ వాహన రహిత కారిడార్లు, వాటర్ వే, సైక్లింగ్ జోన్లు, హౌసింగ్, కమర్షియల్ జోన్లు ఉండనున్నాయి.
కాగా, సీడ్ కాపిటల్ మాస్టర్ ప్లాన్ను జూలై 15వ తేదీలోగా ఇస్తామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. రాజధానిలో భవనంతులు, కార్యాలయాల బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పారు.