పవన్ కల్యాణ్ కు ఆ ధైర్యం ఉందా - జగన్ అంటే అందుకే భయం: మంత్రి జోగి రమేష్..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేసారు పవన్ పిచ్చి కూతలతో ప్రజలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని మంత్రి స్పష్టం చేసారు. ఇప్పటంలో విశాలమైన రోడ్డు వస్తుంటే స్థానికులు సంతోషంతో ఉన్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇప్పటంకు ప్రకటించిన రూ 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. శాంతి భద్రతల కు విఘాతం కలిగేలా పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటి వరకు రెక్కీ జరిగిందంటూ ప్రచారం చేసారని..అలాంటిది ఏమీ లేదంటూ తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారని వివరించారు. ఈ రకమైన ప్రచారంతో విలవలు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలసు పవన్ ఎవరు.. పవన్ ను ఎవరు చంపుతారంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి నుంచి వీకెండ్ కు హైదరాబాద్ కు వెళ్తే .. పవన్ అదే వీకెండ్ కు అమరావతికి వస్తారని ఎద్దేవా చేసారు.
భీమవరం.. గాజువాకలోని గెలవలేని అసమర్ధుడు తమ గురించి సవాళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కు మద్దతుగా చంద్రబాబు ట్వీట్లు చూస్తేంటే ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా ఎలా ఉంటున్నారో అర్దం అవుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం లేదా గాజువాక నుంచి తానే ఎవరి మద్దతు లేకుండా గెలుస్తానని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తాను సీఎం అభ్యర్ధిగా చెప్పుకొనే ధైర్యం ఉందా అని నిలదీసారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని చెప్పుకొనే ధైర్యం పవన్ కు ఉంటే చెప్పాలని సవాల్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ ను చూసి చంద్రబాబు - పవన్ భయపడిపోతున్నారని..అందుకే ఈ కుట్రలు..తెర చాటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరూ కలిసి వచ్చినా..జగన్ ను ఇంచుకూడా కదలించలేరని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేసారు.