గుంటూరు జీజీహెచ్లో దారుణం: బతికున్న శిశువు చనిపోయిందన్నారు
అమరావతి: బతికున్న శిశువు చనిపోయినట్లు ధ్రువీకరించిన ఘటనలో గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయాడని చెప్పిన ఆ వైద్యులు ఎవరిని ఆయన ఫోన్లోనే ప్రశ్నించారు.
శిశువు కదులుతున్నాడని తల్లిదండ్రులు చెప్పినా వైద్యులు పట్టించుకోకపోవడంపై మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే నివేదిక పంపాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే.... గుంటూరు జిల్లాలోని దాసరిపాలెంనకు చెందిన దుర్గా భవానీ(23) కాన్పు నిమిత్తం మంగళవారం ఉదయం జీజీహెచ్కు వచ్చింది. ఆరున్నర గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసిబిడ్డను పరీక్షించిన వైద్యులు, పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది పసిబిడ్డను తండ్రికి ఇచ్చారు.
దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. ఆ తర్వాత ఏడవటం మొదలు పెట్టాడు. కాస్తంత ఆలస్యం చేసి ఉంటే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయేది. ఇదే విషయాన్ని అతడు వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లడంతో చికిత్స నిమిత్తం శిశువును వెంటనే ఐసీయూకు తరలించారు.
దీంతో బతికుండగానే చనిపోయినట్లు చెప్పిన వైద్యుల నిర్లక్ష్యంపై శిశువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్ను సందర్శించారు. శిశువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.