దేశం మొత్తం విద్యుత్ సంక్షోభం; ఏపీకే పరిమితం చేస్తూ టీడీపీ నేతల కుట్రలు: మంత్రి కన్నబాబు
టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చే మనస్తత్వం సీఎం జగన్మోహన్ రెడ్డిది అని కన్నబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు కావాలనే ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ పాలనను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు లేదని కురసాల కన్న బాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేక టిడిపి తప్పుడు విమర్శలు చేస్తోందని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబే
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది తెలుగుదేశం పార్టీనేనని, టీడీపీ అధినేత చంద్రబాబు వల్లే రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రి కన్నబాబు విమర్శించారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు రూపురేఖలు మార్చింది జగన్ సర్కార్ అని పేర్కొన్న ఆయన చంద్రబాబు హయాంలో పాఠశాలలు ఏవిధంగా ఉండేవో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్న మంత్రి కన్నబాబు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామంటే కేసులు వేసి అడ్డుపడుతున్నది చంద్రబాబు అండ్ గ్యాంగ్ అంటూ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేసింది చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు కురసాల కన్నబాబు.

తాగుబోతుల తరఫున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టిడిపి
దేశం మొత్తం కరెంట్ కష్టాలు ఉన్నాయని, ఇక ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని పేర్కొన్న కన్నబాబు రాష్ట్రంలో సమస్య ఏదైనా విమర్శలు చేయడమే టిడిపి లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. దేశంలో తాగుబోతుల తరఫున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టిడిపి అంటూ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి ఆందోళన చేయాల్సిన ప్రతిపక్షాలు మద్యం రేటు పెరిగితే మాట్లాడడం కరెక్టేనా అంటూ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. మందు ముట్టుకొంటే షాక్ కొట్టేలా చేస్తానని సీఎం ముందే చెప్పారని, ఈ మేరకే లిక్కర్ ధరలు పెంచారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు.

ఏపీకే విద్యుత్ సంక్షోభాన్ని పరిమితం చేసే ప్రయత్నం
తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏం చేయాలో తెలియక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు చేయలేదా అంటూ ప్రశ్నించిన కన్నబాబు అప్పుడు తలకు మించిన అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు, నాటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. దేశం మొత్తంగా విద్యుత్తు సమస్య ఉంటే ఆ సమస్యను కేవలం ఏపీకే పరిమితం చేయడానికి టిడిపి నేతలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Recommended Video

దేవాదాయ భూములను ఎవరు ఆక్రమించినా వదిలిపెట్టేది లేదు
తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్థిక సహాయం చేయకపోవడం వల్లనే ఆ ప్రభావం డిస్కంలపై పడిందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టిడిపి నాయకులు తాము చేసిన ఆర్థిక నేరాలు బయట పడకూడదని నలుగురు ఎంపీలను బిజెపికి అప్పగించారని ఆరోపించారు. పేదల కష్టాలు తెలిసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న కన్నబాబు, రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు నిద్రపట్టదంటూ వ్యాఖ్యానించారు. దేవాదాయ భూములను ఎవరు ఆక్రమించినా వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు మంత్రి కన్నబాబు. రైతుల కోసం అంటూ మాట్లాడుతున్న చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసనీ, రైతులకు బేడీలు వేసి పంపిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications