రాజధాని: మంత్రి క్లారిఫై! జగన్ పార్టీపై రఘువీరా ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు సీఆర్డీఏకు శాసన మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. సోమవారం శాసన సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రి నారాయణ రాజధాని కోసం వేల ఎకరాలు ఎందుకో మండలిలో వివరించారు. అనంతరం మండలి బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.
మండలిలో నారాయణ మాట్లాడుతూ.. మొత్తం భూమిలో 5 శాతం నిరుపేదలకు ఇస్తామని చెప్పారు. పార్కులు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, కేంద్ర ఉద్యోగుల సముదాయం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్, ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ ఏర్పటు ఏర్పాటు చేస్తామన్నారు.
పార్టీల తీరు సమాజం సిగ్గు పడేలా ఉంది: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం అన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాలో రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సభలో రాజధాని బిల్లుపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్షాలు ప్రజల ఆకాంక్షలు భిన్నంగా వ్యవహరించాయన్నారు. శాసనసభ పార్టీల వ్యవహారాలు, పాత కక్షలు చూసుకునే వేదికగా మారిందే తప్ప, ప్రజా వేదిక కాలేదని విమర్శించారు. రాజధాని బిల్లుపై జరిగిన చర్చలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం ఉచ్చులో పడిందని రఘువీరా ఆరోపించారు.