అసలేం జరిగిందంటే..: రాజధాని మీద హైకోర్టులో యూ టర్న్పై నారాయణ
అమరావతి: స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ, యూ టర్న్ పైన మంత్రి నారాయణ బుధవారం నాడు స్పందించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో తమ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
అమరావతిలో 2018ని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 1600 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. 10 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఐకానిక్ బిల్డిండ్ నిర్మాణం, కృష్ణా నదిపై రెండు బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు.
20 కి.మీ. మేర రిఫర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామన్నారు. ఈ మధ్యనే ఇన్ఫ్రాస్టక్చర్ చట్టంలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. దీంతో ఏ శాఖ అయినా దాని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలుగుతుందన్నారు. పాత ఇన్ఫ్రాస్టక్చర్ చట్టం ద్వారా స్విస్ ఛాలెంజ్ అహ్వానించామన్నారు.
ఇప్పుడు కొత్త చట్టం ద్వారా స్విస్ ఛాలెంజ్ నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా స్విస్ ఛాలెంజ్ ప్రక్రియ చేపడతామని చెప్పారు. అభివృద్ధిలో భాగంగా విట్ సంస్థకు భూములు ఇచ్చామన్నారు. 2018 నాటికి వారు ఇక్కడ తరగతులు ప్రారంభిస్తారన్నారు. 2018 నాటికి అడ్మినిస్ట్రేటివ్ భవనాలు, పార్కులు, ఫ్లడ్ మ్యానేజ్మెంట్, రోడ్లు, కృష్ణా నదిపై వంతెనలు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
క్యాంటీన్ వివాదం పైన కూడా మంత్రి నారాయణ స్పందించారు. కాంటీన్ వివాదం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇతర క్యాంటీన్లు రాకుండా ఎక్కువ కాలం అడ్డుకోలేరని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనలతోనే సచివాలయంలో సీఆర్డీఏ కాంటీన్ పెట్టారన్నారు.