జగన్! మేం రెచ్చిపోం.. అది రౌడీ లక్షణం, 919 ఎకరాలే: నారాయణ
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి నారాయణ మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీనికి నారాయణ కౌంటర్ ఇచ్చారు.
జగన్ దమ్మూ ధైర్యం అని చెబుతున్నారని, కానీ అలాంటివి రౌడీయిజం చేసే వారి లక్షణాలు అని ఎద్దేవా చేశారు. మేం వారిలా రెచ్చిపోమని, సంప్రదింపులతోనే భూమిని తీసుకుంటామని చెప్పారు. అసైన్డ్ భూముల పైన ప్రభుత్వం దృష్టి పెట్టలేదని వైసిపి చెప్పడం సరికాదన్నారు.
అది వారిది అసంబద్దమైన వాదన అన్నారు. 919 ఎకరాల పైన మాత్రమే వివాదం ఉందని చెప్పారు. ఈ భూముల పరిహారం ఎవరికి అనేది న్యాయపరమైన చర్చ అని చెప్పారు. తాము రైతులను ఒప్పించి భూములు తీసుకున్నట్లు చెప్పారు.
నిమ్మకూరులో నారా లోకేష్
టిడిపి యువనేత నారా లోకేష్ తాను దత్తత తీసుకున్న నిమ్మకూరు గ్రామంలో మంగళవారం పర్యటించారు. గ్రామ అధికారులు, స్థానికులతో అభివృద్ధి పైన చర్చించారు.
రెయిన్ గన్స్ ఇస్తాం: మంత్రి ప్రత్తిపాటి
రైతులకు రాయితీపై త్వరలో రెయిన్ గన్స్ ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లాలోని జగ్గాపురం, యడ్లపాడు గ్రామాల్లో రూ.1.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను కాపాడుకునే నిమిత్తం రైతులకు రెయిన్ గన్స్ను రాయితీ పైన ఇస్తామన్నారు. కృష్ణా ఎగువ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి రైతులకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు.
ఈ కారణంగానే ప్రభుత్వం రెయిన్ గన్స్ను కొనుగోలు చేయనుందన్నారు. జగన్ పైనా పత్తిపాటి మండిపడ్డారు. టీడీపీని అడ్డుకోవడం నాడు వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే కాలేదని, ఇక జగన్ వల్ల ఏమౌతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం జగన్ వల్ల కాదన్నారు.
సిఆర్డీఏలోకి మరో నలుగురు
సీఆర్డీఏలోకి మరో నలుగురిని సభ్యులుగా తీసుకున్నారు. కేశవ్ వర్మ, పాఠక్, క్రిష్టోఫర్ చార్లెస్, ప్రొఫెసర్ దింగ్రాలను తీసుకున్నారు.