వివాదం:నిరుపేదలకు పక్కా ఇళ్ల పథకంలో..."నారాయణ" సంస్థల ఉద్యోగులా?
నెల్లూరు:మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నెల్లూరులో నిర్మిస్తున్న పక్కా ఇళ్లలో అసలైన లబ్ధిదారులను పక్కకు తప్పించి తన సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఈ నివాస గృహాలను కేటాయిస్తున్నారని మంత్రి నారాయణపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వివాదం మొదలైంది.
నారాయణ సంస్థల సిబ్బంది కోసమే కొంతమంది అర్హులైన లబ్దిదారులను అనర్హులుగా ప్రకటించి పక్కకు తప్పించారంటూ స్థానిక దినపత్రికల్లో వార్తలు రావడంతో అసలైన లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. నిరుపేదలైన తమను ఈ విధంగా అన్యాయం చేయడం మంత్రికి తగదని, తమ అర్హతలపై అవసరమైతే మరోసారి విచారణ జరిపి తమకు కేటాయించిన పక్కా ఇళ్లను తమకే దక్కేలా చూడాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే....

లబ్దిదారులు...డబ్బుల వసూళ్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-హౌస్ ఫర్ ఆల్ అనే పథకం ద్వారా నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం పరిధిలో ఉన్న జనార్థనరెడ్డి కాలనీలో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పథకం అమలులో నిజమైన పేదలకు అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పథకం కింద తొలివిడతగా 4800 పేర్లను సంబంధిత మున్సిపల్ ఉద్యోగులు లబ్దిదారుల జాబితాలో చేర్చారు.ఆ మేరకు నిబంధనల ప్రకారం రూ.25,000 చొప్పున రెండు విడతలుగా ఒక్కొక్కరి నుంచి 50 వేల రూపాయలు, మొత్తం 4800 మందికి రూ.24 కోట్లు కట్టించుకున్నారు.

అర్హులు...అనర్హులు...
అయితే ఆ తరువాత ఈ 4800 మందిలో 2400 మందిని అనర్హులుగా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై ఎవరిని సంప్రదించాలో తెలియక మిన్నకున్న వారికి మున్సిపల్ సిబ్బంది నుంచి మాత్రం యథావిథిగా మెసేజ్ లు వస్తుండటంతో వారు అయోమయానికి గురవుతున్నారు. ఎవరినైతే అనర్హులుగా పేర్కొన్నారో వారందరికీ మున్సిపాలిటీ నుంచి మెసేజ్ లు వచ్చాయని, లబ్దిదారుల్లో ఎదరైనా వికలాంగులు ఉంటే వారికి సంబంధించిన వైద్య దృవీకరణ సర్టిఫికెట్, రేషన్ కార్డు, లబ్దిదారుని ఆధార్ కార్డుతో జత చేసి మున్సిపల్ కార్యాలయంలో అందచేస్తే వారికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తమకు అందరికీ సందేశాలు వచ్చాయని చెబుతున్నారు.

అలా ఎలా?...లబ్దిదారుల ప్రశ్నలు
తమను అనర్హుల జాబితాలో చేర్చితే ఆ విషయం మున్సిపల్ సిబ్బందికి తెలియకుండా ఎలా ఉంటుందని, మరి తెలిస్తే అనర్హులైన తమకు మెసేజ్ లు ఎందుకు పంపుతున్నారని, దీనివెనుక కుంభకోణం దాగి ఉందని అంటున్నారు. అర్హులైన 2400 మంది లబ్దిదారులను అనర్హులుగా పక్కకు తప్పించి ఆ స్థానంలో నారాయణ హాస్పటల్, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ నివాస గృహాలను ఇప్పించేందుకే ఇలా చేస్తున్నారని బాధిత లబ్ధిదారులు వాపోతున్నారు. అసలు ఈ పథకంలో ఎవరికి నివాస గృహాలు ఇస్తున్నారో వారందరి పేర్లు, వివరాలు పారదర్శకంగా బైటపెట్టాలని, నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని లబ్దిదారులు కోరుతున్నారు.

ప్రారంభోత్సవం...వాయిదా
ఈ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా నిజానికి గత నెల 24 వ తేదీన వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించాలని భావించారు. అయితే అనుకోకుండా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడటంతో కార్యక్రమం రద్దయింది. అతి త్వరలోనే సిఎం చేతులమీదుగా ఈ నివాస గృహాలను ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో తాజా వివాదం తెరమీదకు రావడం మంత్రి నారాయణకు ఇబ్బందికరంగా మారింది. పైగా ఈ పథకంలో అక్రమాలంటూ స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఈ విషయమై స్పందించక తప్పని పరిస్థితి మంత్రి నారాయణకు ఎదురైంది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందన ఎలా ఉంటుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications