జగన్ విధ్వంసం మీద అంతా సిద్ధం!!
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని, వారి నిర్లక్ష్యంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం విజయవాడలోని కె.ఎల్.రావు ఘాట్ లో రాష్ట్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'పద్మభూషణ్' డా. కానూరి లక్ష్మణరావు 122వ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పోలవరానికి శాపంగా గత వైసీపీ ప్రభుత్వం
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. 2014-19 ప్రభుత్వ కాలంలోనే పోలవరం పనులను 72 శాతం చంద్రబాబు పూర్తి చేశారని, కానీ 2019లో ప్రభుత్వం మారడం పోలవరం ప్రాజెక్టుకు శాపం అయ్యిందని పేర్కొన్నారు. ఏజెన్సీలను మార్చడం, రద్దు చేయడం వంటి కార్యక్రమాలతో దాదాపు 13నెలలు ప్రాజెక్టులో పనులు చేయకుండా ఖాళీగా ఉంచారన్నారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు వైసీపీ ప్రభుత్వ విధ్వంసం మీద, నష్టాల మీద రిపోర్టు కూడా ఇచ్చారన్నారు. జగన్ విధ్వంసం మీద అంతా సిద్ధం అన్నారు.

సమస్యల పరిష్కారం దిశగా అడుగులు
గత ప్రభుత్వ నిర్లక్ష్యధోరణితో నెలకొన్న సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఇకపై ప్రతి ఏటా సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, డా.కె.ఎల్.రావు, శ్రీరాం కృష్ణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. అధికారులు కూడా ఇందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు, తెలుగుజాతి గర్వించదగిన ఇంజనీరు, 'పద్మభూషణ్' డా. కానూరి లక్ష్మణరావు అని కొనియాడారు.
గత ప్రభుత్వ హయాంలో వారిని విస్మరించటం బాధాకరం
గత ప్రభుత్వ పాలనలో సాగు, తాగునీటి రంగాలకు విశేష సేవలు అందించిన మహనీయుల జయంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. నాగార్జున సాగర్ రూపశిల్పి, కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన కె.ఎల్.రావు విగ్రహానికి కనీసం రంగు వేసిన పాపాన కూడా పోలేదని గుర్తు చేశారు మంత్రి నిమ్మల.
చంద్రబాబు ఫోకస్ అంతా పోలవరం పూర్తిపైనే
గత ఐదేళ్ల పాలనలో వారు చూపిన నిర్లక్ష్యంతోనే పోలవరం నష్టపోయిందని, అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. సీఎం చంద్రబాబు తొలి పర్యటనగా పోలవరం వెళ్లారని, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఇది చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. చంద్రబాబు పోలవరం 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు ఎంతో శ్రమించారని, ఆ 7 ముంపు మండలాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు.
ఆయన కలల సాకారం దిశగా చంద్రబాబు అడుగులు
నీటిపారుదల రంగంలో దేశాన్ని డా.కె.ఎల్. రావు సుసంపన్నం చేశారని, ఆ మహనీయుని సేవలను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు, పవన్, మోదీ కూటమి ప్రభుత్వంలో నేడు 122వ జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కె.ఎల్.రావు కలల సాకారం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, నదుల అనుసంధానానికి పెద్దపీట వేసేలా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications