ఏపీలో ఇసుక కొరతకు కారణం చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీలో ఇసుక కొరత నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై మండిపడుతున్నాయి. ఒకపక్క టిడిపి ఇసుక కొరతకు నిరసనగా ఆందోళన బాట పట్టింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక కొరతకు నిరసనగా రెండో రోజు ఇంటి వద్ద దీక్షకు దిగారు. ఇక బిజెపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఇసుక సరఫరా చేయడంలో ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక కొరత నేపథ్యంలో అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి శనివారం సమీక్ష జరిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 35 వేల టన్నుల ఇసుక సరఫరా అవుతోందని ఆయన పేర్కొన్నారు. రోజుకు లక్ష టన్నుల ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇసుక కొరత ఏర్పడడానికి ప్రధాన కారణం వర్షాలు వరదలు అని ఆయన పేర్కొన్నారు.వరదల కారణంగానే ఇసుక సరఫరాకు అంతరాయం కలుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. వరదలు తగ్గే వరకు రైతుల అనుమతితో పట్టా భూముల్లో తవ్వకాలు చేపడతామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఇసుక సరఫరాలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు. కానీ గత కొంత కాలంగా ఉన్న ఇసుక కొరత తో పాటు, ఇప్పుడు వర్షాలు వరదల వల్ల ఇసుక కూడా అందుబాటులో లేకుంటే మరింత కొరత నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి , రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నిర్మాణ రంగం ఇసుక కారణంగా కుదేలు కాకుండా కాపాడాల్సిన అవసరం వుంది.












Click it and Unblock the Notifications