జులై 8న..రూ.1,312 కోట్లతో: సచివాలయాలతో అవి అనుసంధానం: మంత్రి పెద్దిరెడ్డి కీలక భేటీ
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం (Jagananna Swachh Sakalpam) పథకంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఇద్దరు చొప్పున సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకాన్ని విజయవంతం చేయడంపై వారికి దిశా నిర్దేశం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థతో గ్రామీణ పరిపాలనలో పెనుమార్పులను ప్రభుత్వం తీసుకొచ్చామని, దీన్ని మరింత పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, మిల్క్ కలెక్షన్ సెంటర్లను గ్రామ సచివాలయాలకు అనుసంధానిస్తామని అన్నారు. 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించడం ద్వారా సంక్షేమ పథకాలు ప్రజల గుమ్మం ముందుకే తెచ్చామని అన్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని ఆయన సర్పంచ్లకు సూచించారు. గ్రామస్థాయిలో పరిపాలన సజావుగా సాగడానికి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మెరుగైన ఫలితాలను సాధించిన సర్పంచ్లకు రివార్డులు ఇస్తామని అన్నారు. వారిని సత్కరిస్తామని చెప్పారు. సర్పంచ్లకు నిధుల ఇబ్బంది లేకుండా ఇప్పటికే 15 ఫైనాన్స్ టయర్ గ్రాంట్ కింద 656.02 కోట్ల రూపాయలు, అన్ టెయిర్ గ్రాంట్ కింద మరో 652.02 కోట్ల రూపాయలను ఇచ్చామని అన్నారు. మొత్తంగా 1,312.04 కోట్ల రూపాయలతో స్వచ్ఛ సంకల్పానికి ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. ఇందులోనే కోవిడ్ నియంత్రణ కోసం మరో 387 కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పారు.
సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని పేర్కొన్నారు. మొత్తం 13,095 సర్పంచ్లకు గాను 11,152 మందికి చెక్ పవర్ ఇచ్చామని, మిగిలిన 1,943 మందికి ఒకట్రెండు రోజుల్లో చెక్ పవర్ ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. జూలై 8వ తేదీన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమౌతుందని, దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్టుగా, ప్రజలు మెచ్చుకునేలా గ్రామ పరిపాలన ఉండాలని సూచించారు.