మునికోటి మృతి: ప్రధాని స్పందిస్తే బాగుండేదన్న పత్తిపాటి, దురదృష్టకరమన్న రావెల
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త మనికోటి ప్రాణ త్యాగం చేయడం చాలా బాధించిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఆయన ఓ ఛానెల్తో మాట్లాడుతూ ఇకపై ప్రత్యేకహోదా కోసం ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం చంద్రబాబు, బీజేపీ నేత వెంకయ్యనాయుడు కోరుకుంటున్నారని అన్నారు.
మునికోటి ఆత్మహత్యపై ప్రధాని నరేంద్రమోడి స్పందించి, స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం ఆలోచిస్తుందని నిర్మలా సీతారామన్ వంటి కేంద్ర మంత్రులు చెబుతున్నారని, ఇది మంచి పరిణామమని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా విషయమై ఆగస్టు 16 తర్వాత ప్రధాని మోడీని చంద్రబాబు కలవనున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని, ఒకవేళ రాకుంటే ప్రత్యేకహోదాకు సమానమైన నిధులు కోరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు.
మునికోటి ఆత్మహత్య దురదృష్టకరం: మంత్రి రావెల
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ మునికోటి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ, వైసీపీ, కాంగ్రెస్లు రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రత్యేకహోదాపై ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎంపీలు చిత్తశుధ్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని రావెల అన్నారు. ఈ విషయంలో ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
మునికోటి కుటుంబానికి పరిహారం పెంపు
తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరుసభలో ఆదివారం నాడు ఆత్మహత్యయత్నం చేసి మృతి చెందిన మునికోటి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం పరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికోల మునికోటి అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, సి.రామచంద్రయ్య, మంత్రి బొజ్జల, నారాయణ పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.