బంజారా - థింసా డ్యాన్సులతో దుమ్ము రేపిన రోజా..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్ ..మంత్రి రోజా స్టెప్పులతో దుమ్ము రేపారు. బంజారా.. థింసా డ్యాన్సులతో అదరగొట్టారు. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా డ్యాన్స్ చేస్తున్నంతసేపు ఆడిటోరియం హర్ష ద్వానాలతో మార్మోగింది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక వేడుకల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా క్రీడల పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తున్నారు.
జగన్ జన్మదినం సందర్బంగా సంబరాలు
తిరుపతితో పాటుగా గుంటూరు, రాజమండ్రిల్లోనూ వేడకుల నిర్వహణకు నిర్ణయించారు. విశాఖ జోన్ వారికి డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 19, 20 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ఈ జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి రోజా వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి రోజా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. జగనన్న పుట్టిన రోజుకు మించిన పండుగ ఏదైనా ఉందా అని రోజా ప్రశ్నించారు.
బంజారా డాన్స్ చేసిన మంత్రి రోజా
రోజా డాన్స్ తో పాటుగా ఆ సమయంలో ప్రదర్శించిన ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. వైసీపీ శ్రేణులు రోజా డాన్స్ చేస్తున్న సమయంలో కేరింతలతో మహతీ ఆడిటోరియాన్ని మార్మోగించారు. గిరిజన సంప్రదాయ నృత్యమైన బంజారా, థింసా డ్యాన్సు చేసిన రోజా వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయలసీమ పులిబిడ్డ, సంక్షేమ సామ్రాట్ సీఎం జగన్ అన్న అంటూ రోజా చెప్పుకొచ్చారు చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. తాను , తన బినామీలు చల్లగా ఉంటే చాలు, ప్రజలు ఏమైనా ఫర్వాలేదు అనుకునే వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు.
చంద్రబాబును చూస్తుంటే బాధేస్తోంది
చంద్రబాబు ఎందుకు ఫ్రస్టేట్ అవుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఎంత ఫ్రస్టేట్ అయినా.. 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అన్నది తథ్యమని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క కొత్త పథకం తీసుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజలు ఏ మేలూ చేయలేదన్నారు. ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదని, రాయలసీమ లో పుట్టిన చంద్రబాబు.. అలా అరుస్తుంటే బాధగా ఉందని రోజా వ్యాఖ్యానించారు. ఇక, రాజకీయాలు వదిలేసి, మనవడుతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే మంచిదని మంత్రి రోజా పేర్కొన్నారు.