ఆటో డ్రైవర్ గా మంత్రి రోజా - పవన్ కళ్యాణ్ పై సెటైర్లు: ప్రధాని అప్పు చేయటం లేదా..!!
మంత్రి రోజా ఎక్కడకు వెళ్లినా సందడే. ఏకంగా ప్రధాని సభలో మోదీ తో సెల్ఫీ దిగి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ప్రభుత్వం నాలుగో విడత వాహనమిత్ర నిధులను ఈ రోజు విడుదల చేసింది. సీఎం జగన్ అధికారికంగా విశాఖలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో ఈ ప్రోగ్రాంకు హాజరైన మంత్రి రోజాకు ఆటో డ్రైవర్లు వేదిక పైన డ్రైవర్ యూనిఫాం అందించారు. దానిని ధరించిన రోజా ఆ డ్రస్ తోనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటో నడిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

రోడ్ల దుస్థితి పైన జనసేన గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని పైన మంత్రి రోజా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్ళకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేసారు. రోడ్ల గురించి జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరంటూ ధ్వజ మెత్తారు.

నాసిరకం పనులు చేసింది తెలుగుదేశం నాయకులు అని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి తెలుగుదేశం పార్టీయే కారణమంటూ ఆరోపించారు. టిడిపి, బిజెపిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరని నిలదీసారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చినా సీఎం జగన్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ దేశం కోసం అప్పులు చేయటం లేదా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. జనంలో తిరగని ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆరోపించారు. బిజెపితో కలవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామంటూ మంత్రి రోజా మరోసారి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications