సీమ గడ్డ బిడ్డగా డిమాండ్ చేస్తున్నా - మంత్రి రోజా..!
టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ పైన మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తమ మద్దతు మీడియా చేస్తున్న ప్రచారం ప్రజలు నమ్మకపోవటంతో..కొత్త వేదిక ద్వారా బావా - బామ్మర్దిలు నమ్మించే ప్రయత్నం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు - బాలయ్య ఇద్దరూ అన్ స్టాపబలు్ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఎప్పుడు సమస్య వచ్చినా.. పవన్ కళ్యాణ్ ముందుకు రావటం కొత్త కాదని రోజా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే విశాఖలో గర్జన నిర్వహిస్తున్న రోజునే పవన్ కళ్యాణ్ తన టూర్ ఫిక్స్ చేయటం ఒకటిగా పేర్కొన్నారు.

ప్రజల సెంటిమెంట్
ఇది ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ అని.. వారి ముందు పవన్ కళ్యాణ్ కుప్పి గంతులు పట్టించుకోరని రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాయలసీమ - ఉత్తరాంద్రలోనూ సమాన అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని రోజా వివరించారు. సీమ గడ్డ బిడ్డగా తాను రాయలసీమలో న్యాయ రాజధాని కావాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతుగా నిలవటం తోనే స్థానిక సంస్థలు - ఉప ఎన్నికల్లోనూ ఏకపక్షంగా వైసీపీ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.

ప్రజలను రెచ్చగొట్టి
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు - బాలయ్య షో ఒక్క ప్రోమో ఎన్నో వివాదాలకు కారణమైందని చెప్పారు. పదవీ దాహంతో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు..ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితలో లేరన్నారు. ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవంగా చెబుతున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ ను అవమానించింది ఆయన అభిమానులు మర్చిపోరని రోజా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు కోసం పవన్
పవన్ కల్యాణ్ కావాలనే మూడు రోజులు విశాఖలో ప్రోగ్రాం పెట్టుకున్నాడని, గర్జనను డైవర్ట్ చేసి.. ఎల్లో మీడియా ద్వారా తన పిచ్చి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని మంత్రి రోజా ధ్వజమెత్తారు. మూడు రాజధానుల అంశం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు. కుప్పం ప్రజలకు ఏం చేయకుండా చంద్రబాబు మోసం చేసారని విమర్శించారు. బినామీల ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications