రాజకీయ ఉనికి కోసమే బాలయ్య మౌన దీక్ష .. ప్రజలే రాజీనామా చేయమంటున్నారు : మంత్రి శంకర్ నారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జిల్లాల విభజనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. విపక్షాలే కాదు.. అధికార పార్టీ నేతలు సైతం ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల మార్పులపై అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే , హీరో బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
బాలకృష్ణ మౌన దీక్ష..
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు హిందుపురంలోని శ్రీపొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రం చేయడానికి హిందూపురానికి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్.
రాజీనామాకు సిద్దం
రాష్ట్రప్రభుత్వం జిల్లాలను అస్తవ్యస్తంగా విభజించిందని బాలయ్య మండిపడ్డారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేందుకు సిద్ధమని బాలకృష్ణ ప్రకటించారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకే .. రాత్రికి రాత్రి జిల్లాలను ప్రకటించారని ఆయన ఆరోపించారు. మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుండాలనేదే తన కోరికని పేర్కొన్నారు. హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని బాలయ్య స్పష్టం చేశారు.
బాలయ్య దీక్షపై శంకర్ నారాయణ కౌంటర్
అయితే బాలకృష్ణ మౌన దీక్షపై అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ ఉనికి కోసమే బాలయ్య మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు దొంగ మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి బాలకృష్ణ హిందూపురం అభివృద్ధికి చేసిందేమి లేదని విరుచుకుపడ్డారు.
Recommended Video
ప్రజలే రాజీనామా చేయాలని కోరుతున్నారు..
ప్రజలే బాలకృష్ణను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నారని మంత్రి శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. బాలయ్యకు కేవలం సినిమా షూటింగ్ లేనప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకువస్తారని మండిపడ్డారు. ఆధ్యాత్మిక పట్టణమైన పుటపర్తిని జిల్లా కేంద్రంగా సీఎం జగన్ ప్రకటించడం అందరికీ ఆనందదాయకమని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు.