ఏపీలో త్వరలో జనసేన కనుమరుగు; చంద్రబాబుపై ఆ కేసు పెట్టాలి: మంత్రి సీదిరి అప్పలరాజు!!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర ఏపీలో జోరుగా సాగుతుంది. వైసీపీ మంత్రులు ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సామాజిక సాధికారత జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా సాకారం అయ్యిందో చెప్పి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా సామాజిక సాధికారత యాత్రకు సంబంధించి నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సీదిరి అప్పలరాజు జనసేన పార్టీపై విరుచుకుపడ్డారు.
విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్లో సామాజిక సాధికార యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ఏపీలో త్వరలో జనసేన పార్టీ కనుమరుగు కాబోతుందని మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసైనికుల శ్రమను డబ్బుల కోసం వేరే పార్టీలకు అమ్మేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

ఏపీలో ఒక పార్టీకి కేంద్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నారు అని మంత్రి సీదిరి అప్పలరాజు పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. జనసేన అధినేతను నమ్ముకుంటే నట్టేట మునగడమేనని పేర్కొన్న సీదిరి అప్పలరాజు జనసైనికులు మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు.
ఇక ఇదే సమయంలో చంద్రబాబును టార్గెట్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. చంద్రబాబు ఎస్సీ ఎస్టీలను హీనంగా చూశారని కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా ప్రవర్తించారని, నాయి బ్రాహ్మణులతోనూ నీచంగా మాట్లాడారని మంత్రి సీదిరి అప్పలరాజు అసహనం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టి, బి సి, మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్దపీట వేసినట్టు పేర్కొన్నారు. చట్టసభలలోను, కార్పొరేషన్ పదవులలోను వారికి అవకాశం కల్పించినట్టు తెలిపారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఎవరికి రాలేదని కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలనే ఆలోచన వచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. చంద్రబాబుకు జగన్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్న సీదిరి అప్పలరాజు సామాజిక సాధికారత జగన్ తోనే సాధ్యమైందన్నారు.












Click it and Unblock the Notifications