పొలిటికల్ పంచ్: పట్టుకోసం సోమిరెడ్డి వ్యూహాత్మక అడుగులు, నారాయణకు చెక్?
మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానం దక్కడంతో ఆ జిల్లా రాజకీయాల్లో వేడేక్కాయి.
నెల్లూరు: మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానం దక్కడంతో ఆ జిల్లా రాజకీయాల్లో వేడేక్కాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలోని అన్ని గ్రూపులను కలుపుకొనే ప్రయత్నాలను చేస్తున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుండి నారాయణకు మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబునాయుడు. అయితే నారాయణకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మరీ మంత్రివర్గంలోకి చోటు కల్పించారు.
అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇటీవలే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి ఈ నెల 2వ, తేదిన నిర్వహించిన మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో చోటు కల్పించారు.
అయితే మంత్రిపదవి దక్కగానే పార్టీని బలోపేతం చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నాలను ప్రారంభించారు. పార్టీలోని నాయకులను సమన్వయం చేసుకొనే ప్రయత్నాలను ప్రారంభించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం సోదరులను కలిసి చర్చించారు,. లెఫ్ట్ పార్టీల నాయకులతో కూడ ఆయన చర్చించారు.
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మంత్రివర్గంలో చోటు దక్కగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపి ఆధిపత్యం ఎక్కువగా కన్పిస్తోంది.అయితే నెల్లూరు జిల్లాలో వైసీపి ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకుగాను ఆయన ప్రయత్నాలను ప్రారంభించారు. పార్టీలో పాత, కొత్త తరం నాయకుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలను సాగిస్తున్నారు.అంతేకాదు మంత్రివర్గ సహాచరుడు నారాయణతో ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలు ఇచ్చారు. పార్టీపై పట్టుపెంచుకోవడంతో పాటు పాలనపై కూడ తన ముద్రవేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే సోమిరెడ్డికి మంత్రిపదవా?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టాబిరాంరెడ్డి ఓటమితో నెల్లూరు జిల్లాలో పార్టీని గాడిన పెట్టేందుకుగాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు భావించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కగానే పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మంత్రి నారాయణ రాజకీయాలకు కొత్త. మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కడంతో చాలామంది తొలుత ఆశ్చర్యపోయారు.అయితే నారాయణ కంటే సోమిరెడ్డి కారణంగానే నెల్లూరు జిల్లాలో పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని భావించిన చంద్రబాబునాయుడు సోమిరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు పార్టీ నాయకులు.
అధికారుల్లో భయానికి కారణమిదే
నెల్లూరు జిల్లా నుండి నారాయణతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడ మంత్రిపదవి దక్కుతోందనే సమాచారం తెలియగానే అధికారులు భయాందోళనలకు గురయ్యారు.ప్రతి తప్పును సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎత్తిచూపుతారని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.వ్యవసాయశాఖాధికారుల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వ్యవసాయాశాఖాధికారులపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కాలంలో సోమిరెడ్డి చూపిన పవర్ ను మరోసారి చూపాలని ఆయన వర్గీయులు కోరుకొంటున్నారు.అయితే ఈ పరిణామాలు పార్టీకి నష్టం కల్గిస్తాయా, లాభం చేకూరుస్తాయా అనేది బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.
నారాయణ హావా తగ్గిందా?
పురపాలక శాఖ మంత్రి నారాయణ హావా తగ్గిందనే ప్రచారం సాగుతోంది.నారాయణ చెప్పినా అధికారులు ఆయన మాట వినే పరిస్థితులు ఉండవని పార్టీ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.మరో వైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు అందుకు భిన్నంగా ఉంటుందని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. మరో వైపు నారాయణ పార్టీ నాయకులను గుర్తుపెట్టుకొనే పరిస్థితి ఉండదు. ఈ కారణాలన్నీ కూడ సోమిరెడ్డికి కలిసివచ్చే అంశంగా ఉన్నాయి.పార్టీ నాయకులను కనీసం పలకరించని పరిస్థితి మంత్రి నారాయణకు ఉంటుందని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ సోమిరెడ్డికి కలిసివచ్చే అంశంగా కన్పిస్తున్నాయి.